తెలంగాణ

telangana

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీపై ఈసీ బదిలీ వేటు - EC transfers AP Officials

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 10:50 PM IST

EC transfers AP Intelligence DG And SP : ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్​లోని కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు చేసింది. ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను స్థానం చలనం చేస్తూ, ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ఒకరు ఇంటిలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కాగా మరొకరు విజయవాడ సీపీ కాంతిరాణా.

EC transfers Andhra Pradesh Officials
EC transfers AP Intelligence DG And SP

EC transfers Andhra Pradesh Officials :ఏపీలోని కీలక అధికారులపై ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులును బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అలాగే విజయవాడ సీపీ కాంతి రాణా టాటాపై బదిలీ వేటు వేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తక్షణం వారిని విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ, ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీలకు ఎన్నికల తో సంబంధం లేని విధులు అప్పగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటల్లో గా వారి స్థానాల్లో అధికారులను నియమించేందుకు వీలుగా ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లు తో కూడిన ప్యానల్ నూ పంపాలని సూచించింది. సదరు అధికారుల వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాలని స్పష్టం చేసింది. విధులు నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని పీఎస్సార్ ఆంజనేయులు, సీపీ కాంతి రాణాను ఆదేశించింది.

ఇంటెలిజెన్స్ డీజీ ఆరోపణలు :ప్రధాని మోదీ సభలో భద్రతా వైఫల్యానికి ఇంటెలిజెన్స్ డీజీనే కారణమని గతంలో కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కావాలనే రెడ్డి ఐపీఎస్‌లను జిల్లాల్లో ఎస్పీలుగా నియమించారని అభియోగాలు వచ్చాయి. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారని ఆంజనేయులుపై అభియోగాలు ఉన్నాయి. రూ.40 కోట్ల నిధులను పార్టీ సర్వేలకు ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీలనూ భయపెట్టి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేశారన్న ఫిర్యాదులో టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టాలని ఎస్పీలపై ఒత్తిడి చేసినట్లు ఇప్పటికే ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.

బదిలీలపై స్పందించిన కనకమేడల :ఈసీ చర్యలు ఇతర అధికారులకు కనువిప్పు కావాలని మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని వెల్లడించారు. ఈసీకి ఫిర్యాదు చేసినా ఆంజనేయులు తన ప్రవర్తన మార్చుకోలేదన్నారు. జగన్‌ కుట్రలకు ఈ అధికారులు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు.

ఈసీ ఆదేశాలు పక్కనపెట్టి వైసీపీ చెప్పినట్లు నడుస్తున్నారని రవీంద్ర వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విధులు చూడటమే ఇంటెలిజెన్స్ చీఫ్ పని అని, సీతారామాంజనేయులు తనకు ఫోన్‌ చేసి పరోక్షంగా బెదిరించారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. వైసీపీని వీడాక తనను అనేక రకాలుగా వేధించారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details