తెలంగాణ

telangana

ఈసీకి ఎలక్టోరల్​ బాండ్ల వివరాలు- గడువులోగా ఇచ్చిన SBI

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 7:06 PM IST

Updated : Mar 12, 2024, 8:04 PM IST

SBI Electoral Bonds : భారత ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించింది ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఎలక్టోరల్ బాండ్ల డేటాను ECకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

SBI Electoral Bonds
SBI Electoral Bonds

SBI Electoral Bonds :భారత ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(SBI) పాటించింది. ఎలక్టోరల్ బాండ్ల డేటాను ECకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకారం మార్చి 15 సాయంత్రం 5గంటల్లోగా ఎన్నికల సంఘం కూడా ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంది.

అంతకుముందు ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్‌ 30 వరకూ పొడిగించాలంటూ SBI దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఎస్‌బీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన న్యాయస్థానం, సమాచారం అందుబాటులో ఉన్నా ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుబడుతూ బ్యాంకు అభ్యర్థనను కొట్టివేసింది. మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి SBI సమర్పించింది.

ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. దీనికింద ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో దాదాపు 28వేల బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లు. అయితే, ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత జయా ఠాకుర్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), సీపీఎం పిల్‌లు దాఖలు చేశాయి. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది.

రాష్ట్రపతికి సుప్రీం కోర్టు బార్​ లేఖ
మరోవైపు ఎలక్టోరల్​ బాండ్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి లేఖ రాసింది సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్. సుప్రీం తీర్పుపై రాష్ట్రపతి రిఫరెన్స్ కోరాలని ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది. వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరెట్ల పేర్లను వెల్లడించడం వల్ల వారు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Last Updated :Mar 12, 2024, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details