Allahabad University Student Rape :తనకు క్యాన్సర్ ఉందని మాయమాటలు చెప్పి ఓ విద్యార్థిని లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. ఈ ఘటనపై బాధితురాలు యూనివర్సిటీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ యూనివర్సిటీ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఇదీ జరిగింది!
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్ యూనివర్సిటీలో ఓ విభాగంలో అజయ్ కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అయితే అజయ్ గత కొద్ది కాలంగా అదే డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థినిపై కన్నేశాడు. తనను ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ విద్యార్థిని అజయ్కు దూరంగా ఉంటూ వచ్చింది. అయినా అజయ్ అక్కడితో ఆగలేదు. బాధితురాలికి ఇష్టం లేకున్నా ఆమెకు కాల్స్, మెసేజ్లు చేయడం మొదలు పెట్టాడు. ఆమె ఆ నంబర్ బ్లాక్ చేసినా, మరో నెంబర్ నుంచి వేధించేవాడు. అంతేకాకుండా బాధితురాలు క్యాంపస్లో ఒంటరిగా కనిపిస్తే వేధించేవాడు. అయితే ఇవన్నీ చేసినా బాధిరాలు దూరంగా ఉంటూ వచ్చింది.
'ఎవరికైనా చెబితే చంపేస్తా'
ఇలా అయితే లాభం లేదనుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, తాను క్యాన్సర్తో బాధపడుతున్నట్లు బాధితురాలిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. ఆ సాకుతో ఆమెతో తరచూ మాట్లాడేవాడు. ఈ క్రమంలో జనవరి 25న అజయ్ కుమార్ బాధితురాలిని మార్కెట్కు పిలిచాడు. అనంతరం ఏదో సాకు చెప్పి తన గదికి తీసుకెళ్లాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కాగా, ఈ ఘటనపై లేఖ రాసి యూనివర్సిటీ యాజమాన్యానికి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనికి వారు స్పందించలేదు. ఆ తర్వాత పోలీసులకు కూడా బాధితురాలు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.