Viral Video of Young Man Died Due to Electric Shock : పైపులను క్రేన్ హుక్కుకు తగిలిస్తుండగా కరెంట్ షాక్.. వీడియో వైరల్
Viral Video of Young Man Died Due to Electric Shock : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గల ఓ సిమెంట్ పైపుల ఫ్యాక్టరీలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. అతణ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాల్కొండ గ్రామానిక చెందిన ముసాఫిల్(19) స్థానికంగా ఉన్న మాధవ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం కూడా పనికి వెళ్లాడు. పైపులను క్రేన్తో ఎత్తే క్రమంలో.. సిమెంట్ పైపుల పైనున్న విద్యుత్ తీగలు క్రేన్కు తగిలాయి. ఈ విషయాన్ని గమనించని ముసాఫిల్ పైపులను క్రేన్ హుక్కులను తగిలించబోగా.. విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు.
వెంటనే స్థానికులు అతణ్ని సమీపంలో ఉన్న ఆర్మూర్ ఆశా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే యువకుడు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాల్కొండ ఎస్సై కే గోపీ తెలిపారు.