పనిభారం తగ్గించి వేతనాలు పెంచాలి - రోడ్డెక్కిన ఉపాధి హామీ కూలీలు - NREGA WORKERS PROTEST IN SANGAREDDY
Published : May 14, 2024, 1:34 PM IST
Upadi Hami Workers Protest in Sangareddy : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పనిభారం తగ్గించాలని, సమయానికి డబ్బులు చెల్లించాలని ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచి సరైన సమయానికి అందించాలని అల్గోల్ గ్రామానికి చెందిన రెండు వందల మంది కూలీలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నిబంధనల ప్రకారం పనులు చేస్తున్నా సక్రమంగా కూలీ డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పనిచేస్తున్న కార్మికుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా పనులకు రాని వ్యక్తులకు కూలి చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు చెల్లించినా కొన్నిసార్లు పని గంటల కంటే తక్కువ చేస్తున్నారని వాపోయారు. పనిచేసే చోట తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉపాధి హామీలో పని చేస్తున్న వారికి ఆరోగ్య సమస్యలు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించిన మండల పరిషత్ అధికారులు సిబ్బంది కార్యాలయానికి రాకపోవడంతో గంటల కొద్దీ ఎదురుచూసిన కూలీలు చివరకు వెనుదిరిగారు.