ఓటుతో తప్పు జరిగితే మన పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళుతుంది : గంగుల కమలాకర్

ఓటుతో తప్పు జరిగితే మన పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళుతుంది : గంగుల కమలాకర్
BRS Candidate Election Campaign in Karimnagar : తెలంగాణలో కేసీఆర్ను ఓడించి.. రాష్ట్ర సంపదను దోచుకోవడానికి ఇతర పార్టీలు కుట్రలు పన్నుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఎవరైతే తెలంగాణను అభివృద్ధి మార్గంలో నడిపిస్తారో వారికే ఓటు వేయాలని కోరారు.
BRS Candidate Election Campaign in Karimnagar : సమైక్య పాలనలో నల్లబడ్డ తెలంగాణ ముఖం స్వరాష్ట్రంలో తెల్ల ముఖం అయ్యిందని, పచ్చని తెలంగాణను దోచుకునేందుకు ఆంధ్రోళ్లు... కడుపు నిండా విషం పెట్టుకుని... విషపాములై వచ్చారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి, బహదూర్ ఖాన్పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు హారతులు పట్టి డప్పు చప్పుళ్లతో స్వాగతం పలకగా మంత్రి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. 2009 ఎన్నికలకు ముందు చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న చామన్పల్లి... 2009 ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో కలిసిందని.. ఆనాడు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్లు... తాగునీరు లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కరెంటు కోతలతో సరిగ్గా పంటలు పండించుకోలేని పరిస్థితులు ఉండేవని తెలిపారు.
Karimnagar Election Campaign : పదేళ్ల స్వయంపాలనలో కోట్లాది రూపాయలతో పల్లెలను అభివృద్ధి చేశామని తెలిపారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టాలని బీజేపీ ముసుగులో కిరణ్ కుమార్ రెడ్డి, జనసేన ముసుగులో పవన్ కళ్యాణ్ , కాంగ్రెస్ ముసుగులో షర్మిల, కేవీపీలు హైదరాబాద్లో అడ్డా వేశారని మండిపడ్డారు. కేసీఆర్ను ఓడించి తెలంగాణ సంపదను దోచుకెళ్లాలని చూస్తున్నారని.. తస్మాత్ జాగ్రత్త అని ప్రజలకు సూచించారు.
తెలంగాణను దోచుకునేందుకు కేసీఆర్ను ఓడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఒక్క ఓటుతో తప్పు జరిగితే.. రాష్ట్ర పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళుతుందని అన్నారు. అప్పట్లో తాతలు చేసిన తప్పుకు 40-50 సంవత్సరాలు దారిద్య్రాన్ని చూశామని, మళ్లీ అదే తప్పు జరిగితే తెలంగాణ పోరగాళ్ళ జీవితం ఆగం అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
Gangula Kamalakar Fires on Karimnagar Congress Candidate : కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ అని.. ఆయనపై 30కి పైగా కేసులున్నాయని.. ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే జిల్లావాసుల భూములను కబ్జా చేస్తాడని.. ప్రజలను బతుకనివ్వరని అన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడైనా కనిపించారా అని... జిల్లా ప్రజల కష్టాలను పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి కోసం రూపాయి కూడా తేలేదని.. తాను మాత్రం ప్రజల బిడ్డగా వారి మధ్యే ఉన్నానని గుర్తు చేశారు. విలువైన ఓటు వృథా చేయొద్దని... దొంగలకు ఓటు వేయొద్దని... మచ్చలేని తనను ఆశీర్వదించాలని కోరారు. ఓటు వేసే ముందు తమ బిడ్డల భవిష్యత్ ఆలోచించాలని.. తనను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఎవరు మంచోడు.. ఎవరు దొంగో గ్రామాల్లో చర్చించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటు వేయాలని కోరారు.
