వలస ఓటర్లపై అభ్యర్థుల స్పెషల్ ఫోకస్ - పోలింగ్ రోజున రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు

వలస ఓటర్లపై అభ్యర్థుల స్పెషల్ ఫోకస్ - పోలింగ్ రోజున రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు
Candidates Meetings with Telangana Migrant Voters : ఓటర్ల చేతిలోనే అభ్యర్థుల రాజకీయ భవిష్యత్, తలరాత ఆధారపడి ఉంది. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పడని పాట్లంటు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢాంక మోగించడమే లక్ష్యంగా అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. రాష్ట్రం నుంచి జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను కనిపెట్టి.. పోలింగ్ రోజున తీసుకొచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు
Candidates Meetings with Telangana Migrant Voters : ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి ఓటు కీలకమే. రాష్ట్రంలోనివి గాకుండా.. వలస ఓట్లు ముఖ్యమే. ఇప్పుడు అభ్యర్థుల కన్ను వలస ఓటర్లపై పడింది. వారిని గుర్తించి.. కలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ(TS Elections 2023) రాకముందు కరవు పీడిత జిల్లాల నుంచి ప్రజలు.. జీవనోపాధి కోసం పుణె, ముంబయి, భివండికి వలస వెళ్లారు. పిల్లల చదువులు, మెరుగైన జీవనానికి హైదరాబాద్ నగరానికి తరలి వెళ్లారు. అభ్యర్థులు ఈ ఓటర్లను గుర్తించి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలు తీసుకుని.. ఆయా ఓటర్ల చిరునామా, వివరాలు తెలుసుకుంటున్నారు. వారిని ఫోన్లలో సంప్రదిస్తూ.. తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 30న పోలింగ్ రోజున.. గ్రామానికి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీలిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో కలిసి వలస ఓటర్లు అధికంగా ఉన్న పుణె, ముంబయికు వెళ్లి వారితో సమావేశమయ్యారు.
Telangana Migrant Voters : వచ్చే వారం రోజుల్లో మరోమారు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి.. గ్రామాలకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న వలస ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. ఓటుహక్కును గ్రామాల్లోనే వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మరిన్ని సమావేశాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఎక్కడి వారు.. ఎక్కడెక్కడ?.. మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కొందరు జీవనోపాధికి గతంలో పుణె, ముంబయి, భివండి ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఎన్నికలు రాగానే వీరంతా తమ ఓటు హక్కును తెలంగాణలోని తమ సొంత గ్రామాల్లోనే వినియోగించుకుంటున్నారు. నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలు కుటుంబాలు హైదరాబాద్ శివారు కాలనీల్లో నివసిస్తున్నారు. పూర్వ మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఎల్బీనగర్, బీఎన్రెడ్డి నగర్, సాగర్రోడ్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఇప్పటికే ఒకసారి ముంబయిలోని వలస ఓటర్లతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ రోజున వారు ఓటేసేందుకు రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కొడంగల్కు చెందిన మరో పార్టీ నాయకుడు పుణె, ముంబయిలలో సమావేశాలు నిర్వహించారు. నామినేషన్ వేసిన అనంతరం.. ఆయన ఇటీవల మరోసారి ఓటర్లను కలిశారు. నారాయణపేటకు చెందిన అభ్యర్థి.. వలస ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు, మండల నాయకులతో ముంబయి వెళ్లి వారిని కలిసి తనకే ఓటు వేయాలని కోరారు.
