ఆఫీసుల్లో పని చేసే వ్యక్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉండటం సహజం. ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక్కొక్కరు ఒక్కో రిలాక్స్ మార్గాన్ని ఎంచుకుంటారు. కొంతమంది తమ డెస్కులపైన చిన్న మొక్కను పెంచుకుంటే, ఇంకొందరు తమకు నచ్చిన వారి ఫొటో పెట్టుకుని కాసేపు అలా చూసి తమ ఒత్తిడిని మైమరిచిపోతారు. ఇంకొందరైతే లాఫింగ్ బుద్ధాను డెస్కుపై ఉంచుకుని ఒత్తిడిగా అనిపించినప్పుడు ఒక 30 సెకన్లు చూసి రిలీఫ్ అవుతారు. కానీ చైనాలో మాత్రం ఒత్తిడి దూరం చేసుకునేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.
చైనాలోని కార్పొరేట్ ఉద్యోగులు తమ డెస్కులవద్ద పచ్చి అరటిగెలను తెచ్చి మగ్గబెడుతున్నారు. ప్రతి ఒక్కరు తమ డెస్కులపైన నీళ్లు నింపిన గాజుజారులో పచ్చి అరటిగెలను ఉంచి అవి పండిన తర్వాత అందరూ కలిసి తింటారు. అరటిపండ్లు రంగు మారే క్రమాన్ని చూడటం వల్ల పని ఒత్తిడిలో ఉన్నప్పుడు తమ ఆలోచనలు మారతాయని, కాస్త ఉపశమనం లభిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారట.