ETV Bharat / state

Harish Rao: 'దిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో మాత్రం విమర్శిస్తారు'

author img

By

Published : Apr 15, 2023, 4:28 PM IST

Harish Rao Fires on Central Government: కేంద్ర ప్రభుత్వంపై హరీశ్‌రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం కుట్రతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపుతోందని విమర్శించారు. దేశమంతా వైద్య కళాశాలలు ఇచ్చి రాష్ట్రానికి ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణ పథకాల పేర్లు మార్చి దేశంలో అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Harish Rao
Harish Rao

Harish Rao Fires on Central Government: సీఎం కేసీఆర్‌కు పదవులు గడ్డిపోచతో సమానమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతి, రాష్ట్రం కోసం ఆయన నాయకత్వాన్ని అందరమూ బలపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకోవాలని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన, తొమ్మిదేళ్ల బీఆర్ఎస్‌ పాలనకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు వివరించాలని సెర్ప్ ఉద్యోగులను కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సెర్ప్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం తమకు పే స్కేలు ప్రకటించినందుకు కృతజ్ఞతగా సెర్ప్ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మంచినీటి కోసం మహిళలు బిందె పట్టుకోని పరిస్థితి చాలదా.. కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేసేందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ప్రజాసమస్యలు లేవని.. అందుకే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

వేగంగా ఆలోచించే నాయకుడు కేసీఆర్: ప్రజలకు ఏం కావాలో ప్రతిపక్షాల కంటే వేగంగా ఆలోచించే నాయకుడు కేసీఆర్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ పథకాలను దిల్లీలో అవార్డులు ఇస్తారు.. కానీ, గల్లీలో మాత్రం విమర్శిస్తారని ఎద్దేవా చేశారు. కేంద్రం కక్ష, కుట్రతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపుతోందని ఆరోపించారు. దేశమంతా వైద్య కళాశాలలు ఇచ్చి రాష్ట్రానికి ఇవ్వలేదని దుయ్యబట్టారు. డబుల్ ఇంజిన్ అంటారని.. కానీ కర్ణాటకలో ఇచ్చే ఫించను రూ.600 మాత్రమేనని హరీశ్‌రావు వివరించారు.

దేశంలో అమలు చేస్తున్నారు: తెలంగాణ పథకాల పేర్లు మార్చి దేశంలో అమలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని విమర్శించారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీని కూడా ఆరేడేళ్లుగా కేంద్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే: ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ హయాంలో మహిళా సంఘాల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. గతంలో భర్తపైనే మహిళలు ఆధారపడేవారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. భర్తలు ఖర్చుల కోసం భార్యలను అడిగే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. రాష్ట్రాన్ని కేంద్రం అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోందని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో హరీశ్‌రావు ముఖ్యపాత్ర పోషించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పేదల అవసరాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి సత్యవతి రాఠోడ్ వివరించారు. గతంలో హోంగార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. హోంగార్డులకు ఇక్కడ, ఇతర రాష్ట్రాల్లో ఎంత వేతనాలు ఇస్తున్నారో తెలుసుకోవాలని సత్యవతి రాఠోడ్ సూచించారు.

సీఎం కేసీఆర్‌కు పదవులు గడ్డిపోచతో సమానం. తెలంగాణ జాతి, రాష్ట్రం కోసం ఆయన నాయకత్వాన్ని అందరమూ బలపర్చాల్సిన అవసరం ఉంది. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకోవాలి. -హరీశ్‌రావు, మంత్రి

దిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో మాత్రం విమర్శిస్తారు

ఇవీ చదవండి: Errabelli: 'స్వచ్ఛ పల్లెల స్ఫూర్తిని కొనసాగించాలి'

'మోదీకి రూ.1000 కోట్లు ఇచ్చా.. ఆయన్ను అరెస్ట్ చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.