ETV Bharat / state

'దేశానికి ఆదాయం తెచ్చే తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం'

author img

By

Published : Feb 1, 2023, 5:26 PM IST

BRS MPs reaction on central budget 2023 కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 సంవత్సరానికి గాను బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ ఎంపీలు విరుచుకుపడ్డారు. ఏ ఒక్కరికి ఉపయోగం లేకుండా... బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. కేంద్రం... అన్ని రంగాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

BRS MPs reaction on central budget 2023
BRS MPs reaction on central budget 2023

రాబోయే 25ఏళ్ల అమృత కాలానికి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.. అన్ని వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. అయితే ఈ బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి, సాగును కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రూ.45 లక్షల కోట్లలో రూ.15 లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారని విమర్శించారు.

అప్పు తెచ్చిన రూ.15 లక్షల కోట్లలో రూ.11 లక్షల కోట్లు వడ్డీలకే పోతున్నాయని పేర్కొన్నారు. దేశానికి ఆదాయం తెచ్చే తెలంగాణ వంటి రాష్ట్రాలకు ప్రోత్సాహం అందట్లేదని ఆవేదన చెందారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ కేటాయించాలని ఎన్నోసార్లు అడిగామన్న ఎంపీ సురేశ్‌రెడ్డి.. బడ్జెట్‌లో కేటాయించలేదని మండిపడ్డారు. ఐటీఐఆర్‌ ఇస్తే దేశానికి కూడా ఎంతో ప్రయోజనం ఉండేదని వెల్లడించారు. దేశంలో ఉన్నత విద్యకు వెళ్లే యువత శాతం పెరగట్లేదని వివరించారు.

రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఎంపీ కె.కేశవరావు ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావనే లేదని మండిపడ్డారు. చేనేత రంగానికి కేంద్రం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వట్లేదని విమర్శించారు. టెక్స్‌టైల్‌ పార్క్‌కు నిధులు ఇస్తారనుకుంటే.. నిరాశే ఎదురైందని తెలిపారు. విద్య, ఆరోగ్యానికి నిధులు కోత కోశారని ఆవేదన చెందారు.

బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. దేశానికి ఆదాయం తెచ్చే తెలంగాణపై కేంద్రం నిరక్ష్యం వహించింది. అన్ని వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పినప్పటికీ... గ్రామీణాభివృద్ధి, సాగును కేంద్రం నిర్లక్ష్యం చేసింది. అసలు హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ కేటాయించాలని ఎన్నో సార్లు అడిగాం. కానీ ఈసారి కూడా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణకు నిధులు ఇస్తారనుకుంటే.. నిరాశే ఎదురైంది. - బీఆర్ఎస్ ఎంపీలు

అసలు తెలంగాణకు బడ్జెట్‌లో కేటాయించినవి... దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌2023ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..

ఏపీ సంస్థలకు కేటాయింపులు.. ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి - రూ. 47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీ - రూ. 168 కోట్లు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రూ. 683 కోట్లు కేటాయించారు. తెలంగాణ సంస్థలకు కేటాయింపులు.. సింగరేణి - రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌ - 300 కోట్లు, మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు కేటాయించారు.

తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు.. రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు, మంగళగిరి, బిబినగర్‌ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు - రూ. 6,835 కోట్లు, సాలార్జంగ్‌ సహా అన్ని మ్యూజియాలకు - రూ. 357 కోట్లు కేటాయించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.