ETV Bharat / state

GOVERNMENT SCHOOLS: సర్కారు పాఠశాలలకు ‘ప్రైవేట్‌’ నుంచి ప్రవేశాల ప్రవాహం

author img

By

Published : Aug 14, 2021, 6:50 AM IST

కరోనా నేపథ్యంలో ఆర్థికస్థోమత సరిగా లేకనో... సర్కారు బడిలోనూ విద్యను బాగా చెప్తారనే ఉద్దేశంతోనో... చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు బడులకు మార్చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు ప్రైవేటు నుంచి సర్కారు పాఠశాలలోకి 1,14,415 మంది చేరారు.

GOVERNMENT SCHOOLS
ప్రవేశాల ప్రవాహం

రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరం (2021-22) భారీగా పెరిగింది. 1 నుంచి ఇంటర్‌ వరకు 1,14,415 మంది విద్యార్థులు ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి వివిధ సర్కారు పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ శుక్రవారం వెల్లడించింది. సర్కారులో సాధారణ పాఠశాలలతో పాటు విద్యాశాఖ పరిధిలోని మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో వీరంతా ప్రవేశాలు పొందారు. మోడల్‌ పాఠశాలలు, కేజీబీవీల్లో ఇంటర్‌ బోధన ఉన్న విషయం తెలిసిందే. ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 2019-20లో 68,813 కాగా.. గత ఏడాది (2020-21) దాదాపు లక్ష మంది మారి ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. గతేడాదికి సంబంధించి కచ్చితమైన గణాంకాలను వెల్లడించలేదు. కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాల ఆదాయాలు తగ్గడం, ప్రైవేట్‌లో ఆన్‌లైన్‌ తరగతులకూ భారీగా రుసుములు వసూలు చేస్తుండడంతో ఈ వలస మొదలైందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

వివిధ శాఖల పరిధిలో నడుస్తున్న గురుకులాల్లో 5, ఇతర తరగతుల్లో చేరే వారి సంఖ్యనూ పరిగణనలోకి తీసుకుంటే వలస వచ్చిన విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే సర్కారు బడుల నుంచి ఎంత మంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చేరారు? ఎంత మంది చదువు మానేశారన్న లెక్కల్ని విద్యాశాఖ సేకరించలేదు.

1వ తరగతిలో 1.25 లక్షల మంది చేరిక

ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరగతిలో 1,25,034 మంది ప్రవేశాలు పొందారు. ఇంకా రెండు నెలలపాటు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. గత విద్యా సంవత్సరం(2020-21) మొదటి తరగతిలో 1.50 లక్షల మంది చేరారు.

ఇంటర్‌లో లక్ష దాటిన ప్రవేశాలు

రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈసారి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు లక్ష దాటాయి. గత ఏడాది తొలుత 97 వేల మంది చేరారు. తర్వాత గురుకులాలు, మోడల్‌ స్కూళ్లలో సీట్లు రావడంతో దాదాపు 11 వేల మంది అటు వెళ్లిపోయారు. చివరకు 86 వేల మందే మిగిలారు. ఈసారి ప్రవేశాలకు ఇంకా గడువున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య లక్షకు తగ్గకపోవచ్చని ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.