ETV Bharat / state

సమంత పరువునష్టం పిటిషన్​పై తీర్పు నేడే..!

author img

By

Published : Oct 21, 2021, 10:08 PM IST

Updated : Oct 22, 2021, 12:55 PM IST

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న నటి సమంత(actress samantha) పిటిషన్​పై కూకట్​పల్లి న్యాయస్థానం నేడే తీర్పు ఇవ్వనుంది. వాదనల సందర్భంగా క్షమాపణల కోసం ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా నేరుగా కోర్టుకు ఎందుకు వచ్చారని సమంత తరపు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే అందుకు చట్టం అనుమతిస్తోందన్నారు సమంత న్యాయవాది.

samantha defamation case: సమంత అయినా.. సామాన్యులైనా.. కోర్టు ముందు ఒక్కటే!
samantha defamation case: సమంత అయినా.. సామాన్యులైనా.. కోర్టు ముందు ఒక్కటే!

సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ సినీ నటి సమంత(actress samantha) నిన్న కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సమంత పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సెలబ్రిటీలను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. కోర్టు ముందు అందరూ సమానమేనన్నారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా కోర్టు ముందు ఒక్కటేనని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితం విశేషాల ఫొటోలు, విడియోలను ఎప్పటికప్పుడు విరివిగా సామాజిక మాధ్యమాల్లో పంచుకునే సెలెబ్రిటీలే... తిరిగి పరువు నష్టం కేసులు వేయటమేంటని కోర్టు వ్యాఖ్యానించింది.

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న నటి సమంత(actress samantha) పిటిషన్​పై నిర్ణయాన్ని కూకట్ పల్లి కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. పిటిషన్ విచారణ అర్హతపై గురువారం వాదనలు జరిగాయి. క్షమాపణల కోసం ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా నేరుగా కోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వకుండా నేరుగా పిటిషన్ వేసేందుకు చట్టం అనుమతిస్తోందని న్యాయవాది బాలాజీ యలమంజిలి వాదించారు.

తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు రెండు యూట్యూబ్ ఛానెళ్లపై నటి సమంత బుధవారం కూకట్​పల్లి కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానెళ్లలో వెంకట్రావు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్​లో సమంత పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారన్నారు. మీడియా, పత్రికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును సమంత(actress samantha) కోరారు.

ఇటీవలే విడిపోయిన చై-సామ్..

తెలుగు చలన చిత్రపరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ బంధానికి ముగింపు పలికారు. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సామాజిక మాద్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. పదేళ్లుగా తమ స్నేహం కొనసాగినందుకు అదృష్టవంతులమని పేర్కొన్న చైతన్య, సమంత.. ఆ స్నేహమే తమ వివాహ బంధానికి కీలకంగా నిలిచిందన్నారు. అయితే విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని వీరిద్దరూ.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్​లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు.

2010లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏం మాయ చేశావే' చిత్రంతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 2017లో అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు ఎంతో వైభవంగా పెళ్లి జరిపించారు. పెళ్లికి ముందు ఆటో నగర్ సూర్య, మనం చిత్రాల్లో కలిసిన నటించిన సామ్ -చైతన్య.. పెళ్లి తర్వాత మజిలి చిత్రంలో భార్యభర్తలుగా నటించారు. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకొని నిజమైన భార్యభర్తల అనుబంధానికి అద్దం పట్టింది. 2020 వరకు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి వివాహ బంధం లాక్​డౌన్​కు ముందు అనూహ్య మలుపు తిరిగింది.

అక్కడే మొదలైంది!

ట్విట్టర్ ఖాతాలో సమంత తన పేరు పక్కనున్న అక్కినేని ఇంటిపేరును తొలగించి ఎస్ అక్షరం మాత్రమే ఉంచడం వల్ల సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. కానీ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలను ఖండించలేదు. ఆ తర్వాత నుంచి సమంత చైతూకు దూరంగా ఉండటం, ఒంటరిగానే తిరుమల దర్శనానికి వెళ్లిరావడం, ఇటీవల చైతూ నటించిన 'లవ్ స్టోరీ' విడుదల ప్రచారంలో సమంత ఊసే ఎత్తకపోవడం వల్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నారన్న ప్రచారానికి బలం చేకూర్చాయి.

అదే కారణమా?

'సూపర్ డీలక్స్' చిత్రంతో పాటు 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో సమంత తన పరిధికి మించి నటించడం చైతూకు నచ్చలేదనే ప్రచారం జరిగింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. అలా చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవలు.. విడాకుల వరకు దారి తీసినట్లు సమాచారం. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రంలో నటించగా.. చైతన్య తన తండ్రితో కలిసి 'బంగార్రాజు' చిత్రంలో నటిస్తున్నాడు.

ఇదీ చదవండి: న్యూస్‌ ఛానెల్‌లో అశ్లీల వీడియో ప్రసారం..!

Last Updated :Oct 22, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.