ETV Bharat / sports

హైదరాబాద్‌లో ఆదివారమే సానియా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌.. టాలీవుడ్​ ప్రముఖులు హాజరు!

author img

By

Published : Mar 4, 2023, 6:45 PM IST

ఇటీవలే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్​ సానియా మీర్జా ఫేర్​వెల్​ మ్యాచ్​ను హైదరాబాద్​లో ఆడనుంది. ఆ మ్యాచ్​ను తిలకించేందుకు టాలీవుడ్​ ప్రముఖులు హాజరుకానున్నారు. ఆ సంగతులు..

sania
sania

టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్​ సానియా మీర్జా ఇటీవలే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించిన సానియా.. చివరగా దుబాయ్‌ ఓపెన్‌ టోర్నీ ఆడింది. ఆ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన సానియా.. కెరీర్‌కు వీడ్కోలు పలికింది.

అయితే సానియా మీర్జా పుట్టింది ముంబయిలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌లోనే కెరీర్‌ను ప్రారంభించిన సానియా భారత్​ తరఫున మహిళల టెన్నిస్‌లో అత్యున్నత శిఖరానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తాను పెరిగిన హైదరాబాద్‌లో సానియా చివరి మ్యాచ్‌ ఆడాలని భావించింది. అందుకే ఆదివారం హైదరాబాద్‌లో ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఆడనున్నట్లు సానియా మీర్జా మీడియా సమావేశంలో తెలిపింది.

ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడింది. ''అభిమానుల కోసం ఆదివారం చివ‌రి మ్యాచ్ ఆడుతున్నా. విశేషం ఏంటంటే.. 20 ఏళ్ల క్రితం నేను ఎక్క‌డ టెన్నిస్ సాధ‌న చేశానో అక్క‌డే ఆఖ‌రి మ్యాచ్ ఆడునున్నా. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబం, స్నేహితులు వ‌స్తున్నారు. కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎద‌రు చూస్తున్నా. విజ‌యంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నా'' అని సానియా వెల్లడించింది. అంతేకాదు త‌న కుమారుడు, కుటుంబంతో స‌మ‌యం కేటాయిస్తాన‌ని ఈ టెన్నిస్ దిగ్గ‌జం చెప్పుకొచ్చింది.

ఇక ఎల్బీ స్టేడియంలో ఆదివారం సానియా రెండు మ్యాచ్‌లు ఆడ‌నుంది. సానియా, రోహ‌న్ బోప‌న్న టీమ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. డ‌బుల్స్‌లో సానియా బోప‌న్న జోడీ, ఇవాన్ డోడిగ్ మ్యాటెక్ సాండ్స్ జంట‌ను ఢీ కొట్ట‌నుంది. సానియా చివ‌రి సారి ఆడ‌నున్న ఈ రెండు మ్యాచ్‌లు చూసేందుకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌లిరానున్నారు.

తన 20 ఏళ్ల కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్‌ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌ రత్న, అర్జున అవార్డు, పద్మభూషణ్‌, పద్మశ్రీ అందుకుంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ టోర్నీలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు సానియా మెంటార్‌గా వ్యవహరించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.