ETV Bharat / sports

'బాగా అలసిపోయా.. సయ్యద్ మోదీ టోర్నీలో పాల్గొనట్లేదు'

author img

By

Published : Jan 17, 2022, 4:58 PM IST

Lakshya Sen
లక్ష్య సేన్​

Lakshya Sen: మంగళవారం ప్రారంభం కానున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్​ టోర్నమెంట్​లో పాల్గొనడం లేదని ఇండియా ఓపెన్ ఛాంపియన్​ లక్ష్యసేన్ తెలిపాడు. తీరిక లేకుండా షటిల్ ఆడి అలసిపోయినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

Lakshya Sen: 'సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్​ సూపర్​ 300' టోర్నమెంట్​లో పాల్గొనడం లేదని ప్రకటించాడు ఇండియా ఓపెన్ 2022 ఛాంపియన్​ లక్ష్య సేన్​. గతేడాది అక్టోబర్ నుంచి తీరిక లేకుండా బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొంటున్నానని, శారీరకంగా ఎంతో అలసిపోయినందు వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్వాహకులకు ఓ లేఖలో తెలిపాడు. మార్చి నుంచి అన్ని టోర్నీలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.

"ఇండియా ఓపెన్​ టోర్నమెంట్​ను విజయవంతంగా పూర్తి చేశా. ఇప్పుడు బాగా అలసిపోయినట్లు అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీలో పాల్గొంటే న్యాయం చేయలేను అనే భయాందోళన ఉంది. అందుకే టోర్నీకి దూరంగా ఉండాలని భావిస్తున్నా. నా కోచ్​లు, ఫిజియోలు, కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. టోర్నీ నుంచి వైదొలుగుతున్నందుకు నిర్వాహకులకు క్షమాపణలు చెబుతున్నా. వాళ్లు నా పరిస్థితిని అర్థం చేసుకుంటారనే విశ్వాసం ఉంది. టోర్నమెంట్ సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నా. ఇందులో పాల్గొంటున్న అందరికీ, ప్రత్యేకించి భారత ఆటగాళ్లకు విషెస్ చెబుతున్నా."

-లక్ష్య సేన్​

India open 2022 champion

దిల్లీ వేదికగా జరిగిన ఇండియా ఓపెన్​ 2022లో గెలిచి వరల్డ్ ఛాంపియన్ లోహ్​ కీన్​యూకు షాక్ ఇచ్చాడు లక్ష్యసేన్​. ఉత్తరాఖండ్​కు చెందిన ఈ యువకెరటం గతేడాది అక్టోబర్​ నుంచి ఇప్పటివరకు 9 టోర్నీల్లో పాల్గొన్నాడు. తీరిక లేకండా షటిల్ ఆడుతున్నాడు. డచ్​ ఓపెన్​లో ఫైనల్స్ చేరడమే గాక, హైలో టోర్నీలో సెమీఫైనల్స్​, వరల్డ్ టూర్ ఫైనల్స్​లో నాకౌట్ దశకు చేరాడు.

భారత షట్లర్లు ఈ ఏడాది కామన్వెల్త్​ గేమ్స్​ వంటి పెద్ద టోర్నీతో పాటు ఏషియన్ గేమ్స్​, వరల్డ్ ఛాంపియన్స్​, ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్స్ వంటి ముఖ్యమైన టోర్నీల్లో పాల్గొనాల్సి ఉంది. అందుకే సాత్విక్​సాయి రాజ్, చిరాగ్ శెట్టి జోడి కూడా సయ్యద్​ మోదీ టోర్నీకి దూరంగా ఉండనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కిదాంబి శ్రీకాంత్, అశ్వని పొన్నప్ప కూడా పాల్గొనడం లేదు.

సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ జనవరి 18నుంచి 23వరకు ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో జరగనుంది.

అతిపెద్ద విజయం..

ఇండియా ఓపెన్​ ఛాంపియన్​గా అవతరించిన అనంతరం ఆదివారం తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు లక్ష్య సేన్​. మ్యాచ్​ సమయంలో కొంచెం ఆందోళనకు గురైనట్లు చెప్పాడు. అయితే గెలిచిన తర్వాత చాలా సంతోషంగా ఉందన్నాడు. ప్రపంచ టోర్నీల్లో ఇదే తనకు అతిపెద్ద విజయం అని హర్షం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్ జట్టు కోసం రూట్ త్యాగం.. ఐపీఎల్​కు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.