ETV Bharat / opinion

కిట్టూర్-కర్ణాటకలో బీజేపీ x కాంగ్రెస్​.. లింగాయత్‌లే కీలకం.. పీఠం ఎవరిదో?

author img

By

Published : Apr 7, 2023, 9:51 PM IST

కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కిట్టూర్-కర్ణాటక ప్రాంతం కీలకంగా మారింది. మెుత్తం 7 జిల్లాల పరిధిలో 50 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో లింగాయత్‌లదే ఆధిపత్యం. గతంలో ముంబయి-కర్ణాటకగా పిలుచుకునే ఈ ప్రాంతానికి 2021లో కిట్టూర్‌-కర్ణాటకగా ప్రభుత్వం నామకరణం చేసింది. 1990 వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ బెల్ట్‌లో యడియూరప్ప చరిష్మాతో దశాబ్దానికి పైగా భాజపా చక్రం తిప్పింది. మధ్యలో 2013లో కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయింది. ఈ ప్రాంతంలో హోరాహోరీ పోరు నెలకొన్న వేళ ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకుని అధికార పీఠాన్ని వశం చేసుకోవాలని కాంగ్రెస్‌, భాజపా భావిస్తున్నాయి.

karnataka-assembly-election-2023-analysis-on-kittur-karnataka-region
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు 2023

కర్ణాటకలో అత్యంత కీలకమైన ప్రాంతం కిట్టూర్-కర్ణాటక. ఈ ప్రాంతంలోని 7 జిల్లాల్లో 50 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతంలో స్వాతంత్రానికి ముందు బాంబే ప్రెసిడెన్సీలో ఉన్న ఈ ప్రాంతాన్ని ముంబయి-కర్ణాటకగా పిలిచేవారు. దీన్ని కిట్టూర్ కర్ణాటకగా నామకరణం చేయాలని 2021లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కిట్టూర్-కర్ణాటక ప్రాంతంలో బెళగావి, ధార్వాడ్, విజయపుర, హవేరీ, గడగ్, బాఘల్‌కోట్, ఉత్తర కన్నడ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలో అధికార భాజపాకు కాంగ్రెస్‌కు ప్రత్యక్ష పోరు ఉండగా.. జనతాదళ్‌(ఎస్) చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ ఉత్తర కన్నడ జిల్లా మినహా మిగతా ప్రాంతంలో ప్రధానంగా లింగాయత్‌ల ఆధిపత్యం కొనసాగుతుంది. సీఎం బసవరాజ్ బొమ్మై సహా పలువురు సీనియర్ నాయకులు ఈ ప్రాంతం వారే కావడం గమనార్హం.

మారుతున్న లింగాయత్​ల ధోరణి..
2018లో కిట్టూర్‌-కర్ణాటక ప్రాంతంలోని 50 అసెంబ్లీ స్థానాల్లో భాజపా 30 గెలుచుకోగా.. కాంగ్రెస్ 17, జేడీఎస్​ 2, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. రాజకీయంగా ప్రభావవంతమైన లింగాయత్ వర్గం మద్దతుతో ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ప్రస్తుతం వారు భాజపా వైపు నిలిచారు. 1990 వరకు ఈ ప్రాంతంపై కాంగ్రెస్‌కు పట్టు ఉండగా.. అప్పటి ముఖ్యమంత్రి, లింగాయత్ వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్‌ను పదవి నుంచి తప్పించడం వల్ల ఆ వర్గానికి కోపం తెప్పించింది. దీంతో ఆ వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరమై భాజపా వైపు మెుగ్గు చూపింది. అప్పటి నుంచి 2013 వరకు లింగాయత్‌లు కమలం పార్టీ వైపు నిలిచారు.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 50 స్థానాల్లో కాంగ్రెస్‌ 31 స్థానాలు గెలుచుకుని మరోసారి కిట్టూర్-కర్ణాటక ప్రాంతంపై తిరిగి పట్టుసాధించింది. అధికార భాజపాపై ప్రభుత్వ వ్యతిరేకత, యడియూరప్ప వేరు కుంపటి పెట్టడం వల్ల హస్తం పార్టీకి పునర్వైభవం వచ్చింది. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో యడియూరప్ప తిరిగి భాజపాలో చేరడం.. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడం వల్ల భాజపా బలపడింది. దీంతో 2018లో ఈ ప్రాంతంపై కాంగ్రెస్‌ పట్టును కోల్పోయి.. కమలం పార్టీ చేతుల్లోకి వెళ్లింది. అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కిట్టూర్-కర్ణాటక ప్రాంతంలోని బదామీ సీటు నుంచి పోటీ చేసినప్పటికీ.. లింగాయత్‌ల ఉద్యమం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారలేదు. కాంగ్రెస్‌తోపాటు ప్రత్యేక లింగాయత్‌ల ఉద్యమం చేపట్టిన చాలామంది సీనియర్ నేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

భాజపా కీలక నిర్ణయాలు..
మరోసారి అధికారాన్ని చేజిక్కించునేందుకు యత్నిస్తున్న భాజపా.. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న యడియూరప్పను ఎన్నికల వేళ తెరపైకి తీసుకువచ్చింది. రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేసిన లింగాయత్‌లకు 2 శాతం కోటా పెంచుతున్నట్లు కొద్దిరోజుల ముందు బొమ్మై సర్కార్‌ ప్రకటించింది. కిట్టూర్‌-కర్ణాటక ప్రాంతంలోని కొన్ని సెగ్మెంట్లలో ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీ, ముస్లింలు కూడా రాజకీయంగా కీలకంగా ఉన్నారు. దీంతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా..ఇటీవల ధార్వాడ్, బెళగావిలో భారీ బహిరంగ సభలు, మెగా రోడ్‌షోలు నిర్వహించారు. అటు.. గతనెలలో బెళగావిలో కర్ణాటక కాంగ్రెస్ యూనిట్ ఏర్పాటు చేసిన యువక్రాంతి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు.

కర్ణాటకలోనే రెండో అతిపెద్ద జిల్లా అయిన బెళగావిలో 18 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ 2018 లో భాజపా 10, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. ఇరు పార్టీలలో ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలకు చెందిన నేతలు ఈ జిల్లా నుంచే ఉండటం గమనార్హం. జర్కిహోలి సోదరులైన రమేశ్‌ జర్కిహోలి, సతీశ్‌ జర్కిహోలి బెళగావికి చెందినవారే. కర్ణాటకలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రమేశ్ జర్కిహోలి కీలక పాత్ర వహించగా.. సతీశ్‌ జర్కిహోలి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈ ప్రాంతంలో మరింత బలపడటానికి కర్ణాటక వ్యాప్తంగా చేపట్టే "ప్రజాధ్వనియాత్ర"ను బెళగావి నుంచే ప్రారంభించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అటు.. ఈ ప్రాంతంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడం వల్ల ఆ స్థానాలను భర్తీచేసేందుకు భాజపా తంటాలు పడుతోంది.

కీలక నేతల పోటీ..
ఇక ఆరు స్థానాలున్న హవేరీ జిల్లా భాజపాకు కీలకం కానుంది. సీఎం బసవరాజ్‌ బొమ్మై పోటీచేసే శిగ్గవీ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉంది. సీఎం పొరుగు నియోజకవర్గమైన హనగల్‌లో 2021లో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్‌ నెగ్గి భాజపాకు గట్టి షాకిచ్చింది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న బదామీ స్థానం బాఘల్‌కోట్‌ జిల్లాలో ఉంది. అయితే రాజధాని బెంగళూరుకు బదామీ స్థానం దూరంగా ఉండటం వల్ల నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు వీలు కావడం లేదని భావిస్తున్న సిద్ధరామయ్య.. ఈసారి బదామీ నుంచి కాకుండా తన సొంత సీటు వరుణ నుంచి పోటీలో నిలిచారు. మరోవైపు.. కోలార్‌ స్థానం నుంచి కూడా బరిలో నిలవాలని చూస్తున్నారు. బాఘల్‌కోట్ జిల్లాలో 2018లో భాజపా 5, కాంగ్రెస్‌ 2 స్థానాలు దక్కించుకున్నాయి.

విజయపుర జిల్లాలోని బీజాపూర్‌ నుంచి భాజపా ఫైర్‌బ్రాండ్ బసన్నగౌడ పాటిల్ యత్నాల్ మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. యడియూరప్పను బహిరంగంగా ఎన్నోసార్లు విమర్శించిన బసన్నగౌడ.. సీఎం పదవిని ఆశిస్తున్నట్లు గతంలో వెల్లడించారు. ఇక 4 అసెంబ్లీ స్థానాలున్న గడగ్‌ జిల్లా నుంచి ఒకే ఒక ఎమ్మెల్యేను కలిగి ఉన్న కాంగ్రెస్.. ఇక్కడ పుంజుకోవడం చాలా కీలకం. ఏఐసీసీ సభ్యుడు ఎచ్​కే పాటిల్ మాత్రమే ఈ జిల్లాలో హస్తం పార్టీ తరఫున గెలిచారు. మరోవైపు.. కిట్టూర్-కర్ణాటక ప్రాంతంలో సామాజిక, సాంస్కృతిక, వాణిజ్య నిలయమైన ధార్వాడ్ జిల్లాలో 7 స్థానాలున్నాయి. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి పార్లమెంట్ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉంది.

ఇక 6 స్థానాలున్న ఉత్తర కన్నడ జిల్లాలో కాంగ్రెస్‌కు హలియాల్‌ సీటు నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే.. 76 ఏళ్ల ఆర్​వీ దేశ్‌పాండే ఉన్నారు. కోస్తా, పశ్చిమ కనుమల్లో భాజపాకు గట్టి పట్టుంది. సిర్సీ స్థానంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరీ మరోసారి బరిలోకి దిగనున్నారు. మెుత్తం మీద ఈ కిట్టూర్-కర్ణాటక ప్రాంతంలో పట్టును కొనసాగించేందుకు భాజపా.. పునర్వైభవం పొందాలని కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.