ETV Bharat / international

కిడ్నాపైన 8 నెలల చిన్నారి దారుణ హత్య.. కుటుంబసభ్యుల్ని కూడా..

author img

By

Published : Oct 6, 2022, 10:53 AM IST

Updated : Oct 6, 2022, 12:19 PM IST

రెండు రోజుల క్రితం అమెరికా కాలిఫోర్నియాలోని మెర్సిడ్​లో కిడ్నాప్​కు గురైన నలుగురు భారతీయులు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. దీంతో మృతుల స్వస్థలమైన పంజాబ్​లోని హర్సీ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

CALIFORNIA INDIANS MURDER CASE
ABDUCTED BABY GIRL MURDERED IN CALIFORNIA

రెండు రోజుల క్రితం అమెరికా కాలిఫోర్నియాలోని మెర్సిడ్​లో కిడ్నాప్​కు గురైన నలుగురు భారతీయులు మృతి చెందినట్లు కాలిఫోర్నియా పోలీసులు ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఇండియానా-హచిన్సన్ రోడ్ సమీపంలోని తోటలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఓ వ్యవసాయ కార్మికుడు మృతదేహాలను గుర్తించి వెంటనే అధికారులను సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

కిడ్నాప్​కు గురైనవారిలో తండ్రి జస్దీప్​ సింగ్​, తల్లి జస్లీన్​ కౌర్, కూతురు​ ఆరూహీ ధేరీతో పాటు అమన్​దీప్​ సింగ్​ అనే వ్యక్తి ఉన్నారు. వీరందరూ పంజాబ్​లోని హర్సీ గ్రామానికి చెందినవారు. ఈ కేసులో సల్గాడో అనే వ్యక్తిని అనుమానితుడిగా భావించి మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం ఉదయం 36 ఏళ్ల జస్దీప్‌ సింగ్‌ , ఆయన భార్య 27 ఏళ్ల జస్లీన్‌ కౌర్‌, తమ ఎనిమిదేళ్ల పాపతో కలిసి యథావిధిగా వ్యాపార కార్యాలయానికి వెళ్లారు. వీరితోపాటు చిన్నారి మామ 39 ఏళ్ల అమన్‌దీప్‌ సింగ్‌ కూడా అక్కడికి చేరుకున్నారు. కాసేపటికే అక్కడికి వచ్చిన ఓ గుర్తు తెలియని దుండగుడు వారిని తుపాకితో బెదిరించి ఓ ట్రక్కులో ఎక్కించుకొని కిడ్నాప్‌ చేశాడు. కిడ్నాప్‌కు గురైన వారిలో ఒకరి కారు అదేరోజు సాయంత్రం వ్యాపార కార్యాలయ సమీపంలో దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారు నెంబర్‌ ఆధారంగా యజమాని ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. కుటుంబసభ్యులు తమకేమీ తెలియదని చెప్పారు. వారి ఆఫీసుకి వెళ్లి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో కిడ్నాప్‌ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్‌ అయిన వారిలో ఒకరి బ్యాంకు కార్డును మంగళవారం ఉదయం దుండగుడు స్థానిక ఏటీఎంలో ఉపయోగించినట్లు గుర్తించారు. అక్కడి సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ అనుమానితుడి ఫొటోను మెర్సిడెస్‌ కౌంటీ పోలీసులు విడుదల చేశారు. అప్పటి నుంచి తీవ్రంగా గాలింపు చేపట్టి.. అదే రోజు అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న సమయంలోనే అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం గమనార్హం. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.

ఈ ఘటనకి ముందు నిందితుడికి జస్దీప్​ కుటుంబానికి మధ్య ఏదైనా సంబంధాలున్నాయా అనే విషయంపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. కిడ్నాప్​​ వెనుక ఉద్దేశం స్పష్టత లేదని.. అతను వారిని ఎందుకు తీసుకెళ్లాడో అర్థం కావట్లేదని పోలీసులు అన్నారు. ట్రక్కింగ్ కంపెనీలో దొంగతనం జరగలేదని కానీ కిడ్నాప్​కు గురైన వారంతా నగలు ధరించి ఉన్నారని బంధువులు తెలిపారు.

అమెరికాలో 20 ఏళ్ల విద్యార్థి హత్య...
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ 20 ఏళ్ల విద్యార్థి హత్యకు గురయ్యాడు. పుర్డ్యూ విశ్వవిద్యాలయంలోని ఓ హాల్​లో అతడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో వరుణ్​ రూమ్​మేట్ అయిన ఓ కొరియన్​ విద్యార్థి​ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇండియానా పోలిస్‌కు చెందిన వరుణ్ మనీష్ ఛేడా పుర్డూ విశ్వవిద్యాలయంలో డేటా సైన్స్ చదువుతున్నాడు. అదే యూనివర్సిటీలో జిమిన్​ షా అనే యువకుడు జూనియర్ సైబర్ సెక్యూరిటీ మేజర్​ విద్యార్థిగా ఉన్నాడు. బుధవారం ఉదయం సుమారు 12:45 గంటలకు 911 అత్యవసర నెంబర్​కు ఓ కాల్​ వచ్చింది. అందులో ఓ వ్యక్తి ​ వరుణ్​ హత్య గురించి సమాచారం అందించాడు. కాల్ వచ్చిన కొద్దినిమిషాల తర్వాత షాను అనుమానితుడిగా భావించి విశ్వవిద్యాలయ రక్షణా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం పోలీస్​స్టేషన్​కు తరలించారు. మంగళవారం రాత్రి ఆన్‌లైన్‌లో స్నేహితులతో గేమ్​ ఆడుతూ మాట్లాడుతున్నాడని, అకస్మాత్తుగా కాల్‌లో ఏవో అరుపులు విన్నామని స్నేహితులు తెలిపారు.

ఇదీ చదవండి: రెచ్చిపోయిన మాఫియా.. నగర మేయర్​ సహా 18 మంది హత్య

'దగ్గు మందు వల్ల 66మంది పిల్లలు మృతి!'.. ఇండియన్ కంపెనీపై WHO దర్యాప్తు

Last Updated :Oct 6, 2022, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.