ETV Bharat / crime

Kidnap: అడిగిన డబ్బు ఇవ్వకపోతే మన బాబును చంపేస్తా.. చివరికి ఏం జరిగిందంటే !

author img

By

Published : Aug 1, 2021, 8:41 AM IST

వ్యసనాల బారిన పడ్డ ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి డబ్బుల కోసం కన్న బిడ్డనే అపహరించాడు. 20 లక్షలివ్వకపోతే.. కుమారుడిని చంపి, తానూ చనిపోతానంటూ భార్యకి ఫోన్ చేశాడు. వెంటనే భార్య పోలీసులకు సమాచారమిచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. తండ్రీ, కొడుకులిద్దరినీ పట్టుకున్నారు.

father-kidnap-son-at-prakasam
డబ్బుల కోసం మూడేళ్ల కుమారుడి కిడ్నాప్‌.. చివరికి ఏం జరిగిందంటే !

జల్సాలకు అలవాటు పడ్డ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి డబ్బుల కోసం కన్నబిడ్డనే అపహరించాడు. డబ్బులివ్వకపోతే పిల్లాడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కందుకూరులోని పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీఐ వి.శ్రీరామ్‌ వివరాలను వెల్లడించారు. పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డికి అదే గ్రామానికి చెందిన ఉమ అనే యువతితో అయిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

వర్క్​ ఫ్రం హోం చేస్తూ... వ్యసనాలు..

లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాదిగా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జూదం, మద్యం, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడి సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులను అడిగాడు. వారు ససేమిరా అనడంతో జులై 28న కన్న కుమారుడినే అపహరించాడు. అనంతరం బాలుడిని కందుకూరు పట్టణంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి మద్యం తాగి భార్యకు ఫోన్‌ చేశాడు.

పిల్లాడిని ఎత్తుకెళ్లా.. 20 లక్షలివ్వు..

పిల్లాడ్ని అపహరించానని.. రూ.20 లక్షలు ఇవ్వకపోతే వాడిని హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆమె పొన్నలూరు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. సాంకేతికత సహాయంతో కందుకూరులోని ఓ లాడ్జిలో రామకృష్ణారెడ్డి ఉన్నట్టు గుర్తించి పట్టుకున్నారు. పిల్లాడిని విడిపించి తల్లికి అప్పగించారు. నిందితుడిని త్వరగా పట్టుకునేందుకు కృషిచేసిన సీఐ శ్రీరామ్‌, పొన్నలూరు ఎస్సై రమేష్‌బాబులను డీఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి: ఉత్తర్​ప్రదేశ్ టు హైదరాబాద్: ముఠా అరెస్ట్.. 330 తాబేళ్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.