ETV Bharat / crime

ఉత్తర్​ప్రదేశ్ టు హైదరాబాద్: ముఠా అరెస్ట్.. 330 తాబేళ్లు స్వాధీనం

author img

By

Published : Jul 31, 2021, 7:22 PM IST

తాబేళ్లను ఇళ్లలో పెంచుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని కొందరి నమ్మకం. ఈ మూఢనమ్మకాలే కొందరికి కాసులు కురిపిస్తాయి. ముఖ్యంగా అదృష్టం అనే పేరు చెబితే చాలు కొందరు భారీగా ఖర్చు చేసి మరీ.. ఆయా వస్తువులను సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు అక్రమార్కులు తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఇలాంటి ఓ ముఠాను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

Turtles smuggling gang arrest
తాబేళ్లను అమ్మి సొమ్ము చేసుకుందామనుకున్నారు.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు

ఉత్తర్​ప్రదేశ్ నుంచి రైళ్ల ద్వారా హైదరాబాద్​కు తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠాను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. శివ బాలక్​, రాహుల్​ కశ్యప్​ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

తాబేళ్లను అమ్మి సొమ్ము చేసుకుందామనుకున్నారు.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు

యూపీకి చెందిన శివబాలక్, రాహుల్ కశ్యప్ లక్నో సమీపంలోని గోమతి నదిలో తాబేళ్లను పట్టుకుని హైదరాబాద్​కు తరలిస్తున్నారు. పెంపుడు జంతువుల దుకాణాలు, అక్వేరియం షాపుల నిర్వాహకులకు వీటిని విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ విజిలెన్స్ అధికారి రాజా రమణారెడ్డి నేతృత్వంలోని బృందం.. కొనుగోలుదారులుగా వెళ్లి హైదరాబాద్ రామాంతపూర్​లో నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 330 ఇండియన్ టెంట్ తాబేళ్లను స్వాధీనం చేసుకుని ఉప్పల్ రేంజ్ అటవీ అధికారికి అప్పగించారు.

తదుపరి విచారణ పోలీసుల ద్వారా కొనసాగుతుందని రాజా రమణారెడ్డి తెలిపారు. తాబేళ్లను కొనడం, అమ్మటం నిషేధమని.. అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. ఈ సందర్భంగా తాబేళ్లను ఇళ్లలో పెంచుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తాబేళ్లను తరలించి.. అమ్ముతున్న విధానంపై తదుపరి విచారణ కోసం వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్ బ్యూరోకు పీసీసీఎఫ్ శోభ లేఖ రాశారు.

ఇదీ చూడండి: రూ.500కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.