ETV Bharat / city

VINAYAKA CHAVITHI: తగ్గిన విగ్రహాల తయారీ.. చివర్లో వస్తే కష్టమే..

author img

By

Published : Sep 9, 2021, 8:59 PM IST

జంటనగరాల్లో వినాయకచవితి పండుగ సందడి ప్రారంభమైంది. మండపాల్లో గణపతులను నెలకొల్పేందుకు నిర్వాహకులు విగ్రహాలను తరలిస్తున్నారు. విగ్రహాల తయారీకి పేరుగాంచిన దూల్​పేట నుంచి ఇప్పటికే భారీగా విగ్రహాలు తరలివెళ్లాయి. ఈసారి విగ్రహాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయని... దీనివల్ల చివరి నిమిషంలో కొనుగోలు చేసే వారికి కొంత ఇబ్బంది తప్పదని తయారీదారులు చెబుతున్నారు.

ganesh-idols-transport-to-several-places-from-dhulpeta
ganesh-idols-transport-to-several-places-from-dhulpeta

హైదరాబాద్​లో ఘనంగా జరిగే గణేశ్​ నవరాత్రి ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. మండపాలను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు.. విగ్రహాలను తరలిస్తున్నారు. నగరంలో రోడ్లపై విగ్రహాల తరలింపునకు సంబంధించిన వాహనాలతో కోలహలం నెలకొంది. పూజాసామగ్రి కోసం ప్రజలు రోడ్లపైకి రావటంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కిక్కిరిసిపోయాయి.

విగ్రహాల తయారీకి ప్రధాన కేంద్రం దూల్​పేట. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు.. ఇతర రాష్ట్రాలకు కూడా విగ్రహాలు తీసుకెళ్తూంటారు. చివరి నిమిషం వరకు కూడా ఇక్కడ కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే ఈసారి కరోనా భయాలు ఇంకా సమసిపోకపోవటం వల్ల... గణనాథుల తయారీ అంతంతమాత్రంగానే చేశారు. సాధారణంగా ఏడాది మొత్తం చేసే విగ్రహాల తయారీ... ఈసారి కేవలం రెండు నెలల్లోనే చేశారు. దీని వల్ల విగ్రహాల సంఖ్య బాగా తగ్గిపోయింది. చాలా మంది ఇప్పటికే కొనుగోలు చేశారు. భారీ గణనాథులు ఇప్పటికే మండపాలకు చేరుకున్నారు. చిన్న విగ్రహాలు మాత్రమే కొనుగోలుకు ఉన్నాయి.

"ఇరవై ఏళ్ల నుంచి దూల్​పేటకు వస్తున్నాం. ఇక్కడే గణపతి విగ్రహాలు కొంటాం. ఇక్కడికి వస్తేనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. రోడ్లన్ని గణపతులతో సందడిగా ఉంటుంది. ఈసారి మాత్రం విగ్రహాలు ఎక్కువగా లేవు. పెద్ద గణేశ్​ల సంఖ్య తక్కువుంది. చిన్న వినాయకుల రేట్లు ఎక్కువున్నాయి. కోవిడ్​ వల్ల లేబర్​ లేక తక్కువ సంఖ్యలో తయారు చేశామని దుకాణదారులు చెబుతున్నారు. ముడి సరుకుల రేట్లు పెరగటం వల్ల విగ్రహాల రేట్లు కూడా పెరిగాయంటున్నారు." -కొనుగోలుదారు

సాధారణంగా అయితే.. దూల్​పేటలో చివరి నిమిషంలో కూడా విగ్రహాలు తీసుకెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదంటున్నారు. చాలా మంది కొనుగోలు కోసం ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. విగ్రహాలు లేకపోవటమే దీనికి కారణం అని చెబుతున్నారు.

"కరోనా వల్ల పోయిన ఏడాది చాలా నష్టపోయాం. ఈసారి వ్యాపారం కొంచెం మెరుగ్గా ఉన్నా.. విగ్రహాలు చాలా తక్కువ సంఖ్యలో చేశాం. ఏడాది మొత్తం చేయాల్సిన విగ్రహాలు.. కేవలం రెండు నెల్లలోనే చేశాం. మాకు ఈ రెండు నెలలే ప్రభుత్వం అనుమతించింది. పైగా పోయిన ఏడాది నష్టాన్ని, ఈసారి ఉన్న కొవిడ్​ భయాన్ని దృష్టిలో పెట్టుకుని విగ్రహాల సంఖ్య కొంచెం తగ్గించాం. పదిహేను రోజుల నుంచి వానలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. విగ్రహాలకు రెండు సార్లు రంగులు వేయాల్సి వచ్చింది." - దుకాణాదారుడు

విగ్రహాల కోసం వస్తున్న వారితో పాటు స్థానికంగా ఉండే వారు అలంకరణ, పూజాసామగ్రి కొనుగోలు కోసం రోడ్లపైకి రావటంతో రోడ్లపై జనసందడి పెరిగింది. ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది. చాలా రోజుల తర్వాత దూల్​పేటలో అన్ని రకాల వ్యాపారాలు ఊపందుకున్నాయని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఇంకా సందడి పెరుగుతుందని తయారీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.