ETV Bharat / city

Viveka Murder Case Updates : "వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసు"

author img

By

Published : Feb 24, 2022, 6:56 AM IST

Viveka Murder Case Updates
Viveka Murder Case Updates

Viveka Murder Case Updates : వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు పులివెందుల కోర్టు ద్వారా తీసుకున్నారు. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. వాంగ్మూలంలో పేర్కొన్న వారి వివరాలపై విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు. వాంగ్మూలంలో అతను కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది.

Viveka Murder Case Updates : వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి తనపై ఎంతో ఒత్తిడి తెచ్చారని, అయినా తాను లొంగలేదని అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకి తెలిపారు. అవినాష్‌తో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా ఒత్తిడి చేశారన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న భయంతోనే తొలుత హత్యానేరం (ఐపీసీ సెక్షన్‌ 302) కింద కేసు నమోదు చేయలేకపోయానని వివరించారు. కేసు లేకుండానే.. వివేకా మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు వారు ప్రయత్నించారని చెప్పారు. అవినాష్‌రెడ్డికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అత్యంత సన్నిహితుడని, ఎర్ర గంగిరెడ్డి వివేకా వద్ద పీఎస్‌గా పని చేశారని సీబీఐ అధికారులకు వివరించారు. వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసన్నారు. వీరందరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించిందని తెలిపారు. ఈ మేరకు 2020 జులై 28న, గతేడాది సెప్టెంబరు 28న ఆయన సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వాటిల్లోని మరికొన్ని అంశాలు తాజాగా వెలుగుచూశాయి.

‘దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వైకాపా నాయకుడు. డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన కార్యాలయాన్ని శివశంకర్‌రెడ్డే నిర్వహిస్తుంటారు. ఆయనతో పాటు ప్రచారంలో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, వేముల పోలీసుస్టేషన్లలో శివశంకర్‌రెడ్డిపై 30కి పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. ఘటనాస్థలానికి నేను వెళ్లేసరికి శివశంకర్‌రెడ్డి అక్కడే ఉన్నారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించేందుకు వీలుగా ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఫ్రీజర్‌ను వివేకా ఇంట్లోకి తెప్పించారు. మృతదేహాన్ని అందులోకి తరలించకుండా నేను అడ్డుకున్నాను. వీరిద్దరి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా కనిపించింది’ అని శంకరయ్య వాంగ్మూలంలో వివరించారు.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పాటు ఘటనా స్థలం వద్ద భారీగా జనసమూహం ఉండటంతో వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు బ్యాండేజీలు, కట్లు కడుతున్నవారిని నియంత్రించలేకపోయానని శంకరయ్య ప్రస్తావించారు.

ఉదయ్‌కుమార్‌రెడ్డి.. మాట మార్చారు: వాసుదేవన్‌

Viveka Murder Case Latest News : వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15వ తేదీ వేకువజామున గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకా ఇంటి సమీపంలో తిరుగుతున్నట్ల దర్యాప్తులో గుర్తించామని గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన ఆర్‌. వాసుదేవన్‌ సీబీఐకి తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందనే అంశంపై ఉదయ్‌కుమార్‌రెడ్డిని రెండు, మూడు సార్లు ప్రశ్నించగా.. ఒక్కోసారి ఒక్కోలా మాట మార్చి సమాధానాలిచ్చారని ఆయన వివరించారు. 2019 జూన్‌ 17 నుంచి ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఆయన గతేడాది సెప్టెంబరు 1న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

CBI Inquiry on Viveka Murder Case : ‘2019 మార్చి 15వ తేదీ ఉదయం 5.35 గంటలకు నేను మా ఇంట్లో ఉన్నాను. ఆ సమయంలో ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి ఫోన్‌ చేసి తనను అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద దించాలని కోరటంతో అక్కడకు వెళ్లాను’ అంటూ ఒకసారి.. సురేంద్రనాథ్‌రెడ్డి నుంచి ఫోన్‌ వచ్చినప్పుడు తాను బస్టాండులో ఉన్నానని, అక్కడినుంచి ఆయన ఇంటికి వెళ్లి పికప్‌ చేసుకుని అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద విడిచిపెట్టానంటూ మరోసారి ఉదయ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా పొంతనలేని సమాధానమిచ్చారు. భవన నిర్మాణ సామగ్రి తేవడానికి వేకువజామున బస్టాండుకు వెళ్లానని, ఆ సమయంలో ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి నుంచి ఫోన్‌ రావటంతో ఆయన ఇంటికి వెళ్లానని ఇంకోసారి సమాధానమిచ్చారు. కాల్‌డేటా రికార్డుల వివరాలు, టవర్‌ లొకేషన్ల సమాచారం విశ్లేషించి చూస్తే ఉదయ్‌కుమార్‌రెడ్డి చెప్పిన విషయాలు నిజం కాదని తేలింది. ఆయన కార్యకలాపాలన్నీ సందేహాస్పదంగా, అనుమానాస్పదంగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.