ETV Bharat / bharat

అక్కడ మహిళలకు 3 రోజులు నో వర్క్​- ఓన్లీ ఫన్​!

author img

By

Published : Jun 15, 2022, 12:03 PM IST

Updated : Jun 15, 2022, 3:42 PM IST

ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా 3 రోజుల పాటు 'రజా పర్బా' నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజులు మహిళలను దేవతల్లా ఆరాధిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకృతికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బుధవారం ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.

Raja Parba
pahili raja festival

అక్కడ మహిళలకు 3 రోజులు నో వర్క్​- ఓన్లీ ఫన్​!

రుతుస్రావం గురించి బహిర్గతంగా మాట్లాడటానికి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆలోచిస్తారు! అలాంటిది మరో జన్మను ప్రసాదించడానికి దోహదపడే ఈ ప్రక్రియను గౌరవించి, మహిళల గొప్పతనాన్ని గౌరవించడానికి ఓ పండుగ ఉందని తెలుసా? అదే రజా పర్బా. దీనికి మిథున సంక్రాంతి అనే పేరూ ఉంది. ఒడిశాలో నిర్వహించే ఈ పండుగ మూడు రోజుల పాటు జరుగుతుంది. బుధవారమే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజులు.. మహిళలను, ప్రకృతిని పూజిస్తారు.

Raja Parba
రజా పర్బా సంబరాల్లో మహిళలు

అసలు ఎందుకు చేస్తున్నారు?: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూమాత.. భవిష్యత్ వ్యవసాయ కార్యకలాపాలకు తనను తాను సిద్ధం చేసుకుంటుందని (భూమాతకు రుతుస్రావం జరుగుతుందని) నమ్ముతారు అక్కడి ప్రజలు. దీంతో నేల సారవంతంగా మారి పంటలు వేయడానికి అనుకూలంగా మారుతుందని భావిస్తారని ఒడిశా పర్యటక అభివృద్ధి సంస్థ(ఓటీడీసీ) ఛైర్​పర్సన్​ ఎస్​ మిశ్రా తెలిపారు. అందుకే పిండి వంటలు, కాలానుగుణంగా లభించే పళ్లను నైవేద్యంగా పెట్టి భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు ఒడిశా వాసులు.

Raja Parba
ఉయ్యాలలో యువతుల కోలాహలం

ఈ పండగ ఒడిశాలోని వ్యవసాయ పనులు ప్రారంభానికి సూచనగా చెప్పొచ్చు. జూన్ మధ్యలో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి.. తొలకరి జల్లులు కురుస్తాయి. దీంతో అప్పటివరకు ఎండిన నేల తేమగా మారుతుంది. పంటలు వేయడానికి సిద్ధమవుతుంది.

Raja Parba
గోరింటాకు సంబరం

'పితా ఆన్​ వీల్స్​' కార్యక్రమం: మామూలు పండగలా.. పిండి వంటలు తయారు చేస్తారు. వివిధ కేకులతో (పితాస్​) ఈ పండగ జరుపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదివారం 'పితా ఆన్​ వీల్స్​' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఓటీడీసీ. ఈ వాహనంపై పొదా పితా, మండా, కకరా, అరిశా, ఛకులీ, చంద్రకళ వంటి పిండి వంటలు, కేకులను భువనేశ్వర్​, కటక్​, సంబల్​పుర్​ ప్రాంతాల్లో విక్రయిస్తారని మిశ్రా తెలిపారు.

Raja Parba
ఊయలలూగుతూ సందడి

మూడు రోజులు ఇంటి పనుల నుంచి విముక్తి..: అలాగే ఆ మూడు రోజుల పాటు మహిళలు ఎలాంటి ఇంటి పనులు చేయరు. చేతులకు గోరింట, కాళ్లకు పారాణి పెట్టుకుంటారు. కొత్త చీరలు కట్టుకుని అందంగా ముస్తాబై ఆట పాటలతో కోలాహలంగా గడుపుతారు. అయితే ఈసారి కరోనా కారణంగా తక్కువ మందితో ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.

Raja Parba
పండుగ సందర్భంగా స్వీట్లు, పిండి వంటలు

రజా అంటే..: రజా అనే పదం రజస్వల నుంచి వచ్చింది. దీనికి రుతుస్రావం అయిన మహిళ అని అర్థం. మధ్యయుగ కాలంలో ఈ పండుగ వ్యవసాయ సెలవు దినంగా ప్రాచుర్యం పొందింది. ఇది జగన్నాథ స్వామి భార్య అయిన భూదేవి ఆరాధనను గుర్తుచేస్తుంది. పూరి ఆలయంలో భూదేవి వెండి విగ్రహం జగన్నాథ స్వామి పక్కన ఇప్పటికీ ఉంది.

ఇవీ చూడండి:

రుతుచక్రం గుట్టు విప్పుదాం..!

రుతుస్రావంపై ఈ విషయాలు మీకు తెలుసా?

వర్షాలపై ఐఎండీ చల్లని కబురు.. ఈసారి దంచికొట్టుడే!

Last Updated :Jun 15, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.