SC On Delay Of Collegium Recommendations : కేంద్ర ప్రభుత్వం వద్ద కొలీజియం సిఫార్సులు 70 పెండింగ్లో ఉన్నాయంటూ.. న్యాయమూర్తుల నియామకంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని అటార్నీ జనరల్కు సూచించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని లేవనెత్తటం వల్ల అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి స్పందించారు. కొలీజియం సిఫార్సుల పెండింగ్ అంశంపై ప్రభుత్వాన్ని సంప్రదించి.. వారం రోజుల్లో సమాధానం ఇవ్వనున్నట్లు చెప్పారు. AG తక్కువ సమయమే కోరినందున ఏమి మాట్లాడటం లేదన్న న్యాయమూర్తి జస్టిస్ కౌల్.. తర్వాత మాత్రం ఆ పరిస్థితి ఉండదన్నారు. గతవారం వరకు కొలీజియం సిఫార్సులు 80 పెండింగ్లో ఉండగా... అందులో 10 మాత్రమే పరిష్కారం అయినట్లు ధర్మాసనం తెలిపింది. గతేడాది నవంబర్ నుంచి కొలీజియం సిఫార్సులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొంది.
"గతవారం వరకు మొత్తం 80 కొలీజియం సిఫార్సులు పెండింగ్లో ఉన్నాయి. వారం క్రితం 10 పేర్లను ఆమోదించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 70కు చేరింది. ఇందులో 26 సిఫార్సులు జడ్జీల బదీలీలు, ఏడు సిఫార్సులు రెండోసారి పంపినవి. 9 సిఫార్సులు కొలీజియంకు తిరిగి పంపించకుండా ఉన్నాయి. ఒక కేసు మాత్రం సున్నితమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించినది" అని ధర్మాసనం పేర్కొంది.
అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని న్యాయమూర్తులుగా నియమించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. అయితే, కొలీజియం సిఫార్సులు పెండింగ్లో ఉన్నందున.. వారు తమ పేర్లను ఉపసంహరించుకుంటున్నారని చెప్పారు. ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. పెండింగ్లో ఉన్న సిఫార్సులపై భారీ కసరత్తులు అవసరం లేదని.. కేవలం ప్రాథమికంగా పరిశీలిస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము పెండింగ్ నియామకాలను పూర్తి చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నించామని తెలిపారు. ప్రతి 15-20 రోజులకోసారి ఈ అంశాన్ని పరిశీలించామని గుర్తు చేశారు.
కొలీజియం సిఫార్సుల ఆమోదానికి కాలవ్యవధి విధించాలంటూ 2021లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పాటించనందుకు కేంద్రంపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిని బెంగళూరు న్యాయవాదుల సంఘం దాఖలు చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.
Deaf Lawyer Sara Sunny : సుప్రీంకోర్టులో దివ్యాంగ మహిళా న్యాయవాది సైగల వాదన.. చరిత్రలో ఫస్ట్ టైమ్