ETV Bharat / bharat

బ్రిడ్జిపై నుంచి వెళ్తూ నదిలో పడ్డ ట్రాక్టర్.. 12 మంది దుర్మరణం!

author img

By

Published : Apr 15, 2023, 4:45 PM IST

Updated : Apr 15, 2023, 7:16 PM IST

యూపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి నదిలో పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

road accident in Shahjahanpur
road accident in Shahjahanpur

ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహాన్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. 21 మంది మృతి చెందినట్లు తొలుత సమాచారం వచ్చింది. అయితే, మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అనంతరం మరణాలపై అధికారులు వివరణ ఇచ్చారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
తిల్​హాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్సింగ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఊరి ప్రజలు రెండు ట్రాలీల్లో నదిలోకి నీటి కోసం వెళ్లారు. నీటిని తీసుకున్న అనంతరం తిరిగి గ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు ఒకరిని దాటి మరొకరు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఓ ట్రాక్టర్​ను మరో ట్రాక్టర్​ ఓవర్‌టేక్ చేస్తుండగా.. ట్రాలీ బ్యాలెన్స్ తప్పి.. నేరుగా బ్రిడ్జి రెయిలింగ్​ను ఢీ కొట్టింది. అనంతరం బ్రిడ్జి రెయిలింగ్​ విరిగి.. ట్రాక్టర్​ గర్రా నదిలో పడింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం శవ పరీక్షల నిమిత్తం పంపించారు. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్​లో మొత్తం 42 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతుగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేలు ఇవ్వనున్నట్లు లఖ్​నవూలోని ఉన్నతాధికారి తెలిపారు.

ప్రమాద దృశ్యాలు

శనివారం మహారాష్ట్రలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 29 మంది గాయపడ్డారు. రాయ్​గఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే తీవ్ర సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య సేవలు ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు.

Last Updated :Apr 15, 2023, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.