ETV Bharat / bharat

'మోదీకి రూ.1000 కోట్లు ఇచ్చా.. ఆయన్ను అరెస్ట్ చేస్తారా?'

author img

By

Published : Apr 15, 2023, 2:23 PM IST

సీబీఐ, ఈడీపై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మండిపడ్డారు. దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రధానికి వెయ్యి కోట్లు ఇచ్చానని అంటే ఆయన్ను కూడా అరెస్ట్‌ చేయగలరా అని సీబీఐ, ఈడీపై కేజ్రీవాల్​ ప్రశ్నించారు. కపిల్​ సిబల్​ కూడా భాజాపా నాయకత్వం తీవ్రంగా విరుచుకుపడ్డారు.

delhi-liquor-scam-case-arvind-kejriwal-cbi-and-ed-kejriwal-comments-on-modi
మోదీపై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు

దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ కేసులో అరెస్టయిన మనీశ్‌ సిసోదియా 14 ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఆరోపించిన దర్యాప్తు సంస్థలు.. తనిఖీల తర్వాత సీజ్‌ చేసిన జాబితాలో ఆయన 5ఫోన్లు తమ వద్దే ఉన్నట్లు పేర్కొన్నాయని తెలిపారు. ఏడాది విచారణ చేసిన తర్వాత వంద కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్న దర్యాప్తు సంస్థలు.. ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా ఎందుకు సంపాదించలేకపోయాయని కేజ్రీవాల్‌ నిలదీశారు. ప్రధానికి వెయ్యి కోట్లు ఇచ్చానని అంటే ఆయన్ను కూడా అరెస్ట్‌ చేయగలరా అని ప్రశ్నించారు.

"ఏడాది విచారణ తర్వాత వంద కోట్ల ముడుపులు ఇచ్చారు.. తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఆ వంద కోట్లు ఎక్కడున్నాయి? 400 చోట్లకుపైగా దాడులు నిర్వహించారు. మనీశ్‌ నివాసంలో సోఫాలు కూడా ధ్వంసం చేశారు. ఆయన గ్రామంతోపాటు బ్యాంకు లాకర్‌ తనిఖీ చేశారు. వంద కోట్లలో కొంత కూడా దొరకలేదు. ఆ తర్వాత వంద కోట్లు గోవా ఎన్నికల్లో ఉపయోగించారని ఆరోపించారు. గోవాలో తాము సేవలు పొందిన వ్యాపారులందరిపై దాడులు చేశారు. అక్కడ కూడా ఏమీ దొరకలేదు. అన్ని చెక్‌ల ద్వారా చెల్లింపులు చేశాం. అన్ని లెక్కలు ఎన్నికల సంఘానికి సమర్పించాం. అక్కడ కూడా ఏమీ దొరకలేదు. ముడుపులు తీసుకుంటే డబ్బులు ఎక్కడికిపోయాయి? ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా చెబుతున్నా.సెప్టెంబర్‌ 17 సాయంత్రం 7 గంటలకు ప్రధాని మోదీకి వెయ్యి కోట్లు ఇచ్చాను. ఆయన్ను అరెస్ట్‌ చేయండి. దేశంలో ఈ విధంగా ఎవరైనా ఆరోపణలు చేస్తారు. నరేంద్ర మోదీని అరెస్ట్‌ చేయగలరా?.

--అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

'విపక్ష ముక్త భారత్​.. బీజేపీ లక్ష్యం'
విపక్ష ముక్త భారతావనిని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోందని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఆరోపించారు. అందుకే రాజకీయ ప్రత్యర్థులను.. లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. అందులో భాగంగానే.. కేజ్రివాల్‌ను కూడా సీబీఐ విచారణకు పిలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ చర్య ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని.. సిబల్‌ వ్యాఖ్యానించారు. 2024లో తమకు 300 సీట్లు వస్తాయని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారంటే.. ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు ఈ విషయంపై ఆలోచించాలని ఆయన సూచించారు. బీజేపీ.. ఇప్పటికే ఝార్ఖండ్​, ఛత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకుంది. బంగాల్, కేరళ ముఖ్యమంత్రులను సైతం లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష ముక్త భారత్‌ను కోరుకుంటోందని కపిల్​ సిబల్​ ఆరోపించారు.

కేజ్రీవాల్‌ను సాక్షిగా ఎలా పిలిచారో సిసోదియాను కూడా అలాగే సాక్షిగా పిలిచారు. తర్వాత నెమ్మదిగా నిందితుడిగా చేర్చారు. సత్యేంద్ర జైన్‌ ఇప్పటికే జైలులో ఉన్నారు. దర్యాప్తు ముగిసింది అయినప్పటికీ ఆయనకు బెయిల్‌ లభించలేదు. సిసోదియాకు కూడా బెయిల్‌ లభించలేదు. రాజకీయ ప్రత్యర్థులను నాశనం చేయడమే బీజేపీ లక్ష్యం. --కపిల్​ సిబల్, రాజ్యసభ సభ్యుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.