ETV Bharat / bharat

పంజాబ్​ సీఎం సంచలన ప్రకటన.. చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం!

author img

By

Published : Mar 17, 2022, 1:29 PM IST

Updated : Mar 17, 2022, 6:04 PM IST

punjab-cm-mann-big-announcement
పంజాబ్​ కొత్త సీఎం సంచలన ప్రకటన

Punjab CM: పంజాబ్​ నూతన సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే చారిత్రక నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

Punjab New CM: పంజాబ్‌ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరునాడే భగవంత్‌ మాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు తన వ్యక్తిగత నంబర్‌నే ప్రజలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భగత్‌ సింగ్‌ వర్ధంతి రోజు మార్చి 23న అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ నంబర్‌ కింద.. తన వాట్సప్‌ నెంబర్‌ను విడుదల చేస్తానని భగవంత్‌ మాన్ పేర్కొన్నారు. ఎవరైనా లంచం అడిగితే దాని వీడియో లేదా ఆడియోను రికార్డు చేసి తనకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌లో ఇకపై ఎవరూ అవినీతికి పాల్పడవద్దని హెచ్చరించారు.

" దిల్లీలో ఆప్​ అధికారంలోకి వచ్చాక అవినీతి అధికారుల వీడియోలు పంపాలని ప్రజలను అడిగింది. అదే దిల్లీలో అవినీతి అంతానికి దారితీసింది. రానున్న రోజుల్లో నా వ్యక్తిగత వాట్సాప్​ నంబర్​తోనే అలాంటి హెల్ప్​లైన్​ నంబర్​ను అందుబాటులోకి తీసుకొస్తాం. ఎవరైనా లంచం అడిగితే నిరాకరించకుండా.. వీడియో లేదా ఆడియో రికార్డ్​ చేసి ఆ నంబర్​కు పంపాలి. మా అధికారులు దానిని పరిశీలించి చర్యలు తీసుకుంటారని హామీ ఇస్తున్నా. ఏ ఒక్క అవినీతి అధికారి తప్పించుకోలేడు. ఈ హెల్ప్​లైన్​ నంబర్​ను మార్చి 23న విడుదల చేస్తాం. "

- భగవంత్​ మాన్​, పంజాబ్​ ముఖ్యమంత్రి.

స్వాగతించిన కేజ్రీవాల్​..

అవినీతిని అరికట్టేందుకు హెల్ప్​లైన్​ నంబర్​ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చేసిన ప్రకటనను స్వాగతించారు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్​ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​. తమ ప్రభుత్వం దేశ రాజధానిలో అవినీతిని అంతం చేసిందని, ఇప్పుడు మాన్​, ఆయన మంత్రులు నిజాయితీగల ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెప్పారు. దిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలిరోజుల్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు కేజ్రీవాల్​. వాట్సాప్​ నంబర్​ను విడుదల చేశామని, తొలి 49 రోజుల్లోనే 30-32 మంది అధికారులను కటకటాల వెనక్కి పంపామన్నారు. సాధారణ ప్రజల సాధికారతకు ఫోన్​ అతిపెద్ద ఆయుధమని పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ లంచాలు ఇస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు అవినీతిలో భాగమైనట్లు చెప్పారు. ఆప్​ నిజాయితీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏకైక పార్టీగా తెలిపారు.

ఇదీ చూడండి: ఆ ట్వీట్​తో మరోసారి కాంగ్రెస్​ పరువు తీసేసిన సిద్ధూ!

Last Updated :Mar 17, 2022, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.