ETV Bharat / bharat

'మహా' ట్విస్ట్.. NCPలో చీలిక.. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్

author img

By

Published : Jul 2, 2023, 2:04 PM IST

Updated : Jul 2, 2023, 3:33 PM IST

Ajit Pawar BJP : మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అనుమానాలను నిజం చేస్తూ.. NCP కీలక నేత అజిత్‌ పవార్ NDAలో చేరారు. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన అజిత్‌ పవార్‌.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 8 మంది NCP ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ajit pawar deputy cm
ajit pawar deputy cm

Ajit Pawar NDA : అనుమానాలే.. నిజమయ్యాయి. కొద్దికాలంగా శరద్‌ పవార్‌ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్‌ పవార్‌.. అధినేతపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో చేరారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ఉండగా.. ఇప్పుడు రెండో డిప్యూటీ సీఎంగా అజిత్​ పవార్​.. ప్రమాణం చేశారు. పవార్​తోపాటు ఛగన్​ భుజ్​బల్​, దిలీప్ వాల్సే పాటిల్​, ధర్మారావ్ అట్రాం, సునీల్ వాల్సడే, అదితి తట్కరే, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, అనిల్ పాటిల్​ మంత్రులుగా ముంబయిలోని రాజ్​భవన్​లో ప్రమాణం చేశారు.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సీఎం ఏక్‌నాథ్‌ శిందేతో అజిత్‌ పవార్‌ సమావేశమయ్యారు. అప్పటినుంచే స్తబ్దుగా ఉన్న అజిత్‌ పవార్‌.. అకస్మాత్తుగా NDAలో చేరడం ఎన్​సీపీలో కలకలం సృష్టించింది. ఎన్​సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్‌ పవార్‌కు 29 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్​కులే తెలిపారు. వీరింలో మొత్తం తొమ్మిది మంది NCP ఎమ్మెల్యేలు.. ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ హాజరయ్యారు.

రాజ్ భవన్ కు వెళ్లేముందు పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో అజిత్ పవార్ భేటీ అయ్యారు. ఈ భేటీపై తనకు సమాచారం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొనడం గమనార్హం. ఈ భేటీకి శరద్‌పవార్ కుమార్తె, NCP కార్య నిర్వహక అధ్యక్షురాలు సుప్రియా సూలే కూడా హాజరయ్యారు. కానీ సమావేశం అనంతరం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లలేదు.

ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. అప్పటి నుంచి అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నారు. శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని ప్రకటన చేసిన రోజు నుంచి అజిత్ పవార్ మీడియా ఎదుటకు రాలేదు. తర్వాత తాను సంతోషంగానే ఉన్నానని ప్రకటించినా.. ఏదో మూల అసంతృప్తితోనే ఉన్నారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రి శిందే వర్గం పావులు కదిపి అజిత్ పవార్​తో చేసిన సంప్రదింపులు ఫలించాయని దాని ఫలితంగానే ఈరోజు పార్టీలో చీలిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

'రాహుల్​తో వేదిక పంచుకోవడం వల్లే'
ఇటీవల పట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో రాహుల్​ గాంధీతో వేదిక పంచుకోవడం, కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకోవడంపై.. శరద్ పవార్​ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్లే కలత చెందామని అజిత్​ పవార్​ వర్గం ఎమ్మెల్యేలు తెలిపారు. మరోవైపు.. ఎన్​సీపీ అధ్యక్ష పదవి అప్పగిస్తారని అజిత్ ఆశించారు. అలా జరగకపోవడం వల్ల ఇలా తిరుగుబాటు చేసినట్లు సమాచారం.

Last Updated :Jul 2, 2023, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.