ETV Bharat / bharat

మేఘాలయలో అధికారంపై కాంగ్రెస్‌ కొండంత ఆశలు.. 'చేతి'కి చిక్కేనా?

author img

By

Published : Feb 15, 2023, 7:03 AM IST

ఈశాన్య భారతంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న మూడు రాష్ట్రాల్లో మేఘాలయపైనే కాంగ్రెస్​ ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలో ఉన్న 60 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్​ తమ అభ్యర్థులను దింపింది. అయితే తృణమూల్‌, భాజపా సైతం సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నా.. ప్రధాన పోటీ మాత్రం ఎన్‌పీపీ, హస్తం పార్టీ మధ్యే కనిపిస్తోంది.

meghalaya elections
meghalaya elections

Meghalaya Elections 2023: ఈశాన్య భారతంలో ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు జరుగుతున్న మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కొండంత ఆశ పెట్టుకుంది మేఘాలయపైనే! ఖాసీ, జయంతియా, గారో కొండలతో కూడిన ఈ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 60. వాటన్నింటా కాంగ్రెస్‌ ఇప్పుడు తమ అభ్యర్థులను బరిలో దింపింది. అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) 57 చోట్ల పోటీ చేస్తుండగా.. భాజపా 60, తృణమూల్‌ కాంగ్రెస్‌ 58, యునైటెడ్‌ డెమోక్రటిక్‌ పార్టీ (యూడీపీ) 47, వాయిస్‌ ఆఫ్‌ ద పీపుల్‌ పార్టీ (వీపీపీ) 18, హిల్‌ స్టేట్‌ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (హెచ్‌ఎస్‌పీడీపీ) 11 స్థానాల్లో బరిలో ఉన్నాయి. తృణమూల్‌, భాజపా సైతం సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నా.. రాష్ట్రంలో ప్రధాన పోటీ మాత్రం ఎన్‌పీపీ, కాంగ్రెస్‌ మధ్యే కనిపిస్తోంది.

.

కాంగ్రెస్‌: విన్సెంట్‌ పాల గెలిపిస్తారా?
రాష్ట్రంలో 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 స్థానాలు సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఎన్‌పీపీ, భాజపా, ఇతర చిన్న పార్టీలు సంకీర్ణ సర్కారును ఏర్పాటుచేశాయి. షిల్లాంగ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విన్సెంట్‌ హెచ్‌ పాల 2021 ఆగస్టులో మేఘాలయ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులవడం స్థానిక కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమైంది. ఆయన నియామకంపై మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత ముకుల్‌ సంగ్మా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి తృణమూల్‌ గూటికి చేరారు. మిగతా ఎమ్మెల్యేలూ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. విన్సెంట్‌ పాల గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో అత్యంత సంపన్న నేతల్లో ఒకరు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న షిల్లాంగ్‌ లోక్‌సభ సీటు పరిధిలో 36 శాసనసభ స్థానాలున్నాయి. జయంతియా కొండల్లో విన్సెంట్‌ పాలకు గట్టి పట్టుంది. ప్రస్తుతం ఆయన వేసే ఎత్తులపైనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. పాల సుట్నాగ-సైపంగ్‌ శాసనసభ స్థానం నుంచి స్వయంగా బరిలో నిలిచారు.

.

ఎన్‌పీపీ: మిత్రపక్షాల ఆరోపణలతో కలవరం
రాష్ట్రంలో అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు ఎన్‌పీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్‌ సంగ్మాయే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి. మేఘాలయ సీఎంగా, లోక్‌సభ స్పీకర్‌గా గతంలో పనిచేసిన పీఏ సంగ్మా కుమారుడీయన. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీపీ 19 స్థానాలే గెల్చుకుంది. యూడీపీ (6), పీడీఎఫ్‌ (4), భాజపా (2), హెచ్‌ఎస్‌పీడీపీ (2)లతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కాన్రాడ్‌ సంగ్మా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సీఎం పీఠమెక్కారు. అయితే ఆ మిత్రపక్షాలన్నీ ప్రస్తుతం విడివిడిగా పోటీ చేస్తూ.. సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తుండటం ఎన్‌పీపీకి తలనొప్పిగా మారింది. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌ పోటీతో కాంగ్రెస్‌ ఓట్లలో చీలిక వస్తుందని, ఎన్నికల అనంతరం మిత్రపక్షాలు మళ్లీ తనకే మద్దతుగా నిలుస్తాయని ఎన్‌పీపీ ఆశిస్తోంది. తద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని భావిస్తోంది. ఈశాన్య భారత్‌ నుంచి జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఏకైక పార్టీ ఎన్‌పీపీ. రాజస్థాన్‌, మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో అది గతంలో కొన్ని అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంది. మేఘాలయలో ప్రస్తుతం అధికారాన్ని నిలబెట్టుకుంటేనే.. ఇతర రాష్ట్రాల్లో దాని మనుగడ కొనసాగుతుంది! ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలు కాన్రాడ్‌ సంగ్మాకు అగ్నిపరీక్షగా మారాయి.

తృణమూల్‌, భాజపా సైతం..
ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరణే లక్ష్యంగా పెట్టుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ సైతం మేఘాలయలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేత ముకుల్‌ సంగ్మా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 24 శాసనసభ స్థానాలున్న గారో కొండల్లో ఆయనకు పట్టుంది. భాజపా ప్రస్తుతం 60 స్థానాల్లో పోటీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో దానికి అంతగా బలం లేదు. దానికితోడు- క్రైస్తవ మతంలో చేరిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థగా ఉన్న జనజాతి ధర్మ సంస్కృతి సురక్షా మంచ్‌ (జేజేడీఎస్‌ఎం) అస్సాంలో ప్రదర్శనలు చేస్తుండడం భాజపాకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. జేజేడీఎస్‌ఎంతో తమకు సంబంధం లేదని, క్రైస్తవుల సమస్యలకు ఎదురు నిలిచేవారిలో తామే ముందుంటామని మేఘాలయ భాజపా నాయకులు ప్రకటనలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.