ETV Bharat / bharat

రెండు కుటుంబాలు.. ఐదు ఆత్మహత్యలు.. బెంగళూరులో విషాదం

author img

By

Published : Dec 20, 2022, 3:08 PM IST

Updated : Dec 20, 2022, 3:43 PM IST

కర్ణాటకలో విషాదం నెలకొంది. రెండు వేర్వేరు కుటుంబాలను చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అత్తింటివారి వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ.. తన ఏడాదిన్నర చిన్నారితో సహా బలవన్మరణానికి పాల్పడింది.

suicide in Bangalore
ఆత్మహత్య

కర్ణాటక బెంగళూరులో ఘోరం జరిగింది. రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
మృతులను యశోద (72), ఆమె కుమారుడు నరేష్ గుప్తా(36), కుమార్తె సుమన్ గుప్తా(32)గా పోలీసులు గుర్తించారు. మృతుడు నరేశ్​, అతడి చెల్లి సుమన్ గుప్తాకు ఇంకా వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. నరేష్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అని పేర్కొన్నారు. ఈ కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు.

వరకట్న వేధింపులు తట్టుకోలేక..
అత్తింటివారు పెట్టే వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ గృహిణి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హోసకోటేలోని కల్కుంటే అగ్రహారలో జరిగింది. మృతులను శ్వేత (24), ఏడాదిన్నర వయసున్న యక్షిత్‌గా పోలీసులు గుర్తించారు. మృతురాలు శ్వేతకు రాకేశ్​తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల రాకేశ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై రాకేశ్​, శ్వేత మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పంచాయితీ పెద్దలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా.. వీరి మధ్య గొడవలు ఆగలేదు. రాకేశ్​, అతని కుటుంబ సభ్యులు.. శ్వేతను అదనపు కట్నం తీసుకురమ్మని వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్వేత.. తన ఏడాదిన్నర చిన్నారితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై అనుగొండనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వివాహేతర సంబంధానికి మరొకరు బలి..
గుజరాత్​.. వడోదరలో వివాహేతర సంబంధానికి ఓ వ్యక్తి బలయ్యాడు. దభోయ్​కు చెందిన జయేశ్ రోహిత్​ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన కైలాశ్​ బెన్ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఇంటికి వచ్చిన జయేశ్​ను.. కైలాశ్ బెన్, ఆమె కుమారుడు విక్రమ్ కలిసి కర్రలతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని జయేశ్​ ఇంటి ఆవరణలో పడేశారు. ఈ ఘటనపై పోలీసులకు గ్రామస్థులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు.

అనుమానాస్ఫద రీతిలో..
ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో దారుణం జరిగింది. 11వ తరగతి విద్యార్థిని అభ్యంతరకర వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు సోమవారం రాత్రి తన గదిలో అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆమె గదిలో ఒక తాడు ఉండడం గమనార్హం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని అభ్యంతరకర వీడియోను ఇర్ఫాన్ అనే యువకుడు వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Last Updated :Dec 20, 2022, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.