రెండు దశాబ్దాల కిందట అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు ఆ వ్యక్తులు. అయితే వారి మోసం బయటపడిన నేపథ్యంలో 64మందిపై వేటు వేసింది ఉత్తర్ప్రదేశ్ సర్కారు. నిందితులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆరోగ్యశాఖ ఉద్యోగాల్లో చేరారని రుజువు అయిన నేపథ్యంలో మీర్జాపుర్ ముఖ్య వైద్యాధికారి ఓపీ తివారీ.. వారిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
18 ఏళ్లుగా విచారణ..
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాల్లో చేరారన్న ఆరోపణలపై ఈ ఉద్యోగులు 18 ఏళ్లుగా విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆర్థిక నేరాల నియత్రణ విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా.. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని విధుల నుంచి తొలగించాలని జూన్ 10న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
1996 నుంచి 1998 మధ్య 64 మంది ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగాల్లో చేరారు. 2002లో జరిగిన ఆడిట్లో వారి ధ్రువీకరణ పత్రాలు సరైనవి కావని గుర్తించారు అధికారులు. ఈ ఉద్యోగుల నియామకంపై అనుమానం లేవనెత్తిన నాటి అధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశించిన సర్కారు.. తాజాగా సమర్పించిన నివేదికతో చర్యలకు ఉపక్రమించింది.
ఇదీ చూడండి: అమెరికా నుంచి 100వెంటిలేటర్లు వచ్చేస్తున్నాయ్..