ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వైద్య సిబ్బంది, పీపీఈ కిట్ల కొరత ఓవైపు వేధిస్తోంది. ఫలితంగా వారి రక్షణ గాలిలో దీపంలా తయారైంది. ఈ నేపథ్యంలో రోగి ఆరోగ్య పరిస్థితిని ప్రతి నిమిషం పర్యవేక్షించడం కష్టతరంగా మారింది. ఇందుకు పరిష్కారంగా నెదర్లాండ్స్ ఆమ్స్టర్డ్యామ్కు చెందిన ప్రముఖ ఆరోగ్య సాంకేతిక సంస్థ 'రాయల్ ఫిలిప్స్' సరికొత్త ఆవిష్కరణ చేపట్టింది. ఆసుపత్రుల్లో కరోనా రోగులను పర్యవేక్షించేందుకు వీలుగా బయోసెన్సార్ను అభివృద్ధి చేసింది.
ఇది ఏక కాలంలో ఎక్కువ మంది రోగులపై దృష్టి సారించేందుకు ఉపయోగపడనుంది. ఆసుపత్రుల్లో వినియోగించేందుకు అమెరికాకు చెందిన ఆహార ఔషధ నిర్వహణ సంస్థ(ఎఫ్డీఏ) నుంచి క్లియరెన్స్ పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇలా పనిచేస్తుంది...
ఫిలిప్స్ బయోసెన్సార్ బీఎక్స్100 అని పిలిచే ఈ పరికరం ఎంతో తేలికైనది. దీనిని రోగి ఛాతికి అమర్చుతారు. ఈ పరికరమే బాధితుడి శ్వాసకోస, హృదయ స్పందన రేటును ప్రతి నిముషానికి నమోదు చేసి భద్రపరుస్తుంది. ఫలితంగా రోగికి మరింత కచ్చితత్వంతో చికిత్స అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్య పరిస్థితుల్లో అనూహ్య మార్పు సంభవిస్తే వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.
" ప్రస్తుతం ఉన్న కరోనా కాలంలో ఫిలిప్స్ బయోసెన్సార్ బీఎక్స్ 100 పరికరం రోగులపై నిఘా ఉంచేందుకు సాయపడుతుంది. అంతే కాకుండా వైద్య సంరక్షకులకు వైరస్ సోకకుండా కాపాడే వీలుంటుంది. పీపీఈ కిట్ల కొరతకు తీర్చేందుకు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది".
-పీటర్ జీసే, ఫిలిప్స్ జనరల్ మేనేజర్ మానిటరింగ్ అంట్ అనలిటిక్స్
ఇప్పటికే నెదర్లాండ్స్లోని ప్రముఖ ఆసుపత్రి ఓఎల్జీవీలో.. కరోనా రోగుల కోసం బయోసెన్సార్ను ఉపయోగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. రక్షణ పరికరాలు లేకుండా రోగి గదిలోకి వెళ్లడం ప్రమాదకరమని.. ఇటువంటి ఆవిష్కరణల ద్వారా వైద్యులు మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుంటుందని పేర్కొంది.
ప్రస్తుతం ఈ బయోసెన్సార్ను ఐదు రోజులు మాత్రమే వినియోగించే వీలుంది. ఆ తర్వాత మరొకటి మార్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరింతగా దీన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.