ETV Bharat / bharat

Sunitha on Viveka Case: అప్పుడే అవినాష్​ రెడ్డిపై అనుమానం మొదలైంది: సునీత

author img

By

Published : Jul 22, 2023, 1:41 PM IST

Updated : Jul 23, 2023, 8:04 AM IST

Sunitha on YS Bharathi
Sunitha on YS Bharathi

13:39 July 22

ఎక్కువ సమయం తీసుకోనంటూ.. భారతి వెంటనే ఇంటికి వచ్చేశారు: సునీత

అప్పుడే అవినాష్​ రెడ్డిపై అనుమానం మొదలైంది: సునీత

Narreddy Sunitha key comments on viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి..కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సేకరించిన కీలక వాంగ్మూలాలను గత నెల 30వ తేదీన నాంపల్లిలోని సీబీఐ కోర్టులో సమర్పించింది. ఈ మేరకు సీబీఐ.. కోర్టులో సమర్పించిన వాంగ్మూలాలు శుక్రవారం రోజున వెలుగులోకి రావటం, అందులో సీఎం జగన్‌ ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, విశ్రాంత సీఎస్‌ అజేయ కల్లం, వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్‌ అటెండర్‌ గోపరాజు నవీన్‌కుమార్‌‌లను సాక్షులుగా చేర్చటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసుకు సంబంధించి..సీబీఐ సేకరించిన మరికొన్ని వాంగ్మూలాలు ఈరోజు వెలుగులోకి వచ్చాయి. ఇందులో వివేకానంద రెడ్డి మృతికి ముందు, తర్వాత ఏయే సంఘటనలు జరిగాయి..?, ఎవరెవరు ఏయే సలహాలు ఇచ్చారు..?, అనినాష్ రెడ్డిపై వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతకు ఎప్పుడు అనుమానం వచ్చింది..?, సునీతకు వైఎస్ భారతి ఏం చెప్పారు..?, సలహాదారు సజ్ఞల రామకృష్ణరెడ్డి ఏం చెప్పారు..?, వివేకా హత్యపై సునీత భర్త రాజశేఖర్ వాంగ్మూలం ఏంటీ..? అనే కీలక అంశాలు ఇవాళ తెరపైకి వచ్చాయి.

వివేకా హత్యపై కుమార్తె సునీత.. వివేకానంద రెడ్డి హత్యపై కేసు నమోదు చేసిన సీబీఐ.. ఆయన (వివేకా) కుమార్తె నర్రెడ్డి సునీతను సాక్షిగా పేర్కొంటూ.. ఆమె వాంగ్మూలాలను విడుతలవారిగా సేకరించింది. కేసు విచారణలో వెలువడుతున్న సాక్ష్యాలకు అనుగుణంగా.. గత నెల 30వ తేదీన, గతేడాది మే 13వ తేదీన, సెప్టెంబరు 19వ తేదీన, ఈ ఏడాది మే 31వ తేదీన, జూన్ 13వ తేదీన వాంగ్మూలాలను సేకరించింది. వీటన్నింటిని క్రోడీకరించిన సీబీఐ.. గత నెల 30న అనుబంధ అభియోగపత్రంతోపాటు, సునీత వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టారా..? అని సీబీఐ అధికారి అడిగిన ప్రశ్నకు సునీత ఇలా వివరణలు ఇచ్చారు.

ఆరోజు నేను ఆశ్చర్యపోయాను.. ''మీడియాతో 2019 మార్చి 19 నుంచి 29 తేదీల మధ్య మీడియాతో మాట్లాడాను. మా కుటుంబంలో సుమారు 700 మంది ఉన్నారు. పలు రకాల సమస్యలు ఉన్నప్పటికీ మాకు మేము హత్యలు చేసుకోలేదని 2019 మార్చి 19న మీడియాకు చెప్పాను. దీంతోపాటు పోలీసులను ప్రభావితం చేయవద్దని..కొందరు పెద్దలు పదేపదే మాట్లాడుతున్నారని కూడా ఆ రోజు మీడియాకు చెప్పాను. జగన్‌ను సీఎంగా చూడాలని మా నాన్నగారు నిర్విరామంగా పనిచేశారని కూడా ఆ రోజు మీడియాకు చెప్పాను. ఆ తర్వాత మార్చి 22న దిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి, అక్కడ కూడా మీడియాతో మాట్లాడాను. అప్పుడు..నాన్న హత్యపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలని పునరుద్ఘాటించాను. దిల్లీలో నేను ఉన్న అవినాష్ రెడ్డి అపార్ట్‌మెంట్‌కు ధర్మారెడ్డి అనే వ్యక్తి వచ్చి సీఈసీతో సమావేశం ఏర్పాటు చేయించారు.

ఆ తర్వాత నేను హైదరాబాద్ తిరిగి వచ్చాను. 2019 మార్చి 23న వైఎస్ భారతీ రెడ్డి నాకు ఫోన్ చేసి.. ఇంటికొచ్చి కలుస్తానన్నానని చెప్పింది. దానికి నేను సైబరాబాద్ కమిషనరేట్‌కు.. అక్కడి నుంచి కడపకు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పాను. ఎక్కువ సమయం తీసుకొనే విషయం కాదంటూ.. భారతీ వెంటనే ఇంటికి వచ్చేసింది. భారతీతోపాటు విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడం నేను ఆశ్చర్యపోయాను. ఎక్కువ వాహనాలు ఉన్నందున వేర్వేరుగా వచ్చి ఉంటారమోనని అనుకున్నాను. లిఫ్టు వద్దే నిలబడి భారతీతో మాట్లాడాను. అయితే, ఆరోజు భారతీ ఆందోళనగా కనిపించింది. దానికి నేను వివేకా మరణించిన తర్వాత మొదటిసారి ఇంటికొచ్చింది కదా.. బాధలో ఉండొచ్చని నేను భావించాను.'' అని సునీత సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.

ఇకపై సజ్జలను సంప్రదించామని భారతీ చెప్పింది.. అంతేకాకుండా, వివేకా మృతి విషయంలో ఇకపై ఏం చేసినా సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించాలంటూ తనతో భారతీ చెప్పారని సీబీఐకి సునీత వెల్లడించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాలని సజ్జల రామకృష్ణారెడ్డి తనతో చెప్పారని ఆమె వివరించారు. సజ్జల ఆలోచన తనకు ఇబ్బందిగా అనిపించి.. ఓ వీడియోను చేసి ఆయనకు పంపించినట్లు సునీత తెలిపారు. గదిని శుభ్రం చేస్తున్నప్పుడు సీఐ శంకరయ్య తీరుపై ఫిర్యాదు చేస్తూ.. ఆ వీడియోను రూపొందించానన్నారు. ఆ వీడియోను చూసిన సజ్జల రామకృష్ణరెడ్డి.. తాను చెప్పింది అలా కాదని.. ఈ అంశానికి ముగింపు పడేలా భారీ ప్రెస్‌మీట్ పెట్టాలన్నారని సునీత వివరించారు. ఈ అంశంపై మరింత చర్చ జరగవద్దన్న ఉద్దేశంతో సజ్జల ఉన్నారన్నారు. ప్రెస్‌మీట్‌లో జగన్‌తో పాటు అవినాష్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించాలని సజ్జల తనకు సలహా ఇచ్చారని సునీత చెప్పారు. అప్పటి వరకు తాను ఎక్కడా అవినాష్ పేరును ప్రస్తావించలేదని సునీత వివరించారు. సజ్జల సలహా మేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టినట్లు సునీత సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. సలహా కోసం ప్రెస్‌మీట్‌ అంశాల పీపీటీని సజ్జల రామకృష్ణారెడ్డి, మధు ధాత్రికి పంపించి, ఆమోదం తీసుకున్నట్లు సునీత తెలిపారు.

క్రిమినల్ మైండ్స్ గురించి అర్ధంకాలేదు.. అయితే, సజ్ఞల రామకృష్ణ రెడ్డి తనకు అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించాలని చెప్పినప్పుడు.. తాను కొంత సంకోచించినట్లు నర్రెడ్డి సునీత సీబీఐకి తెలియజేశారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తన తండ్రి కోరుకోలేదన్న ఆమె.. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విబేధాలున్నందున కొంత ఆలోచించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సభల్లో అప్పటి సీఎం పదేపదే చెబుతున్న విషయాలు నిజమైతే..?, వాస్తవాలను ఎందుకు బయటపెట్టరని..?, పోలీసులు ఎందుకు వదిలి పెడతారు..? అని తాను భావించినట్లు సీబీఐకి సునీత తెలిపారు. అక్కడ ఉన్న పోలీసులు హత్య కాదని భావించి.. గదిని శుభ్రం చేయడానికి అనుమతించి ఉంటారని.. దానికి తన కుటుంబం ఎలా బాధ్యులని ఆలోచించినట్లు సునీత సీబీఐకి వివరించారు. పొరపాటుగా జరిగిందని తనకు తెలిసిందని.. అయితే, క్రిమినల్ మైండ్స్ ఎలా పనిచేస్తాయో అర్థం కాలేదని సునీత వ్యాఖ్యానించారు. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని ప్రతీ ప్రకటనలోనూ తాను చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. జగన్‌ను సీఎంగా చూడాలని తన తండ్రి కష్టపడ్డారని.. ఎవరో చేసిన పొరపాటుకు మళ్లీ నష్టపోవడం ఎందుకని అనుకున్నట్లు సునీత సీబీఐకి తెలిపారు.

ఆ కాగితంపై సంతకం చేయలేదు.. మార్చి 15వ తేదీన వివేకా మృతి విషయం తెలియగానే.. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు వెళ్లినట్లు సునీత సీబీఐకి వివరించారు. పోస్టుమార్టం జరిగిన మార్చురీకి వెళ్లి.. ఓ డాక్టర్‌గా తన తండ్రి మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించి, బయటకు వచ్చినట్లు ఆమె తెలిపారు. మార్చురీ బయట ఉన్నప్పుడు బీటెక్ రవి, ఇతర టీడీపీ నేతలపై ఫిర్యాదు రాసుకొచ్చి.. తనను సంతకం చేయమన్నారని సునీత వివరించారు. జమ్మలమడుగులో వివేకానంద రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నందున..టీడీపీ నేతలు భయపడి, అది మనసులో పెట్టుకొని ఈ నేరానికి పాల్పడ్డారని ఆ రోజు అవినాష్ రెడ్డి తనకు చెప్పారని సీబీఐకి సునీత వెల్లడించారు. ఆ సమయంలో అవినాష్‌తో పాటు ఎన్.శివప్రకాష్ రెడ్డి, పి.రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారని ఆమె సీబీఐకి తెలిపారు. అయితే, ఆ ఫిర్యాదుపై తాను సంతకం చేయలేదని సునీత సీబీఐకీ వెల్లడించారు.

ఆరోజునే అవినాష్ రెడ్డిపై అనుమానమొచ్చింది.. తన తండ్రి మృతి విషయంలో అవినాష్ రెడ్డిపై అనుమానం ఎప్పుడొచ్చిందో సీబీఐకి సునీత వెల్లడించారు. 2019 జులై నెలలో అవినాష్ రెడ్డిపై తనకు అనుమానం మొదలైందని సీబీఐకి సునీత తెలిపారు. వివేకా మృతి విషయం బయటకు రాకముందే తన కుమారుడికి తెలుసునని.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని సునీత వెల్లడించారు. అవినాష్ రెడ్డి, శివశంకర్‌ రెడ్డికి ఉదయ్ ప్రధాన అనుచరుడు కావడంతో తనకు అనుమానం వచ్చిందన్నారు. ఉదయ్ కుమార్‌ రెడ్డికి ప్రమేయం ఉండొచ్చునని.. 2019 ఆగస్టు 1నే కడప ఎస్పీకి తాను సమాచారం ఇచ్చినట్లు వివరించారు.

వాట్సప్ స్క్రీన్ షాట్‌ను సీబీఐకి అప్పగించిన సునీత.. ఆ తర్వాత 2019 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకూ భారతీకి, సునీతకు మధ్య జరిగిన మెసేజ్‌‌ల స్క్రీన్ షాట్‌ను జూన్ 13న సునీత సీబీఐకి ఇచ్చారు. 2019 మార్చి 27న సజ్జల రామకృష్ణా రెడ్డికి పంపించిన వాట్సప్ స్క్రీన్ షాట్‌ను కూడా ఆమె సీబీఐకి అప్పగించారు. అంతకు ముందు వివేకా ఇంటి లోపల, బయట, మార్చురీ వద్ద పరిస్థితులు, శివశంకర్ రెడ్డి అరెస్టు సమయంలో పులివెందుల కోర్టు వద్ద అవినాష్ రెడ్డి, తదితర వీడియోలు, డాక్యుమెంట్లను రెండు పెన్‌డ్రైవ్‌లలో గతేడాది మే 13న సీబీఐకి సునీత సమర్పించారు. శివశంకర్ రెడ్డి, తదితరులు స్థానికులను ప్రభావితం చేస్తున్నారంటూ.. పలు ఫ్లెక్సీలను, ప్రారంభోత్సవాలను గతేడాది అక్టోబరు 19న మరిన్ని ఆధారాలను కూడా సీబీఐకి ఆమె సమర్పించారు.

సునీత భర్తను ప్రశ్నించిన సీబీఐ.. వైఎస్ వివేకానంద రెడ్డి మృతి విషయంలో నర్రెడ్డి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి సీబీఐకీ కీలక విషయాలను వెల్లడించారు. వైఎస్ రాజారెడ్డి హత్య తర్వాత జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని.. వివేకా హత్య స్థలిలో లభించిన లేఖను తాను వచ్చేవరకూ దాచిపెట్టమన్నానని రాజశేఖర్ రెడ్డి సీబీఐకి తెలిపారు. ఉదయం ఆరున్నర గంటలకు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి తనకు ఫోన్ చేసి, లేఖ ఉందని చెప్పారని ఆయన సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. ఆ లేఖలో ఏముందని తనని అడగ్గా.. డ్రైవర్ ప్రసాద్ బాధ్యుడిగా ఉందని కృష్ణారెడ్డి చెప్పారన్నారు.

హత్యకు ముందు ఎంపీగా పోటీచేస్తానని చెప్పారు.. ఆ తర్వాత రాజారెడ్డి హత్య సమయంలో జరిగిన పరిణామాలతో పాటు.. ప్రసాద్‌కు ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని.. తాను వచ్చి వ్యక్తిగతంగా పోలీసులకు ఇస్తానని చెప్పానని రాజశేఖర్ రెడ్డి సీబీఐకీ వివరించారు. అనంతరం 'వివేకా పేరిట ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీకూ తెలుసా..?' అంటూ సీబీఐ రాజశేఖర్ రెడ్డిని అడగ్గా.. కొన్ని తెలుసునని సమాధానం చెప్పారు. హత్యకు ముందు రోజు రాత్రి కడప ఎంపీగా తాను పోటీ చేయనున్నట్లు జమ్మలమడుగులో వివేకా చెప్పినట్లు తనకు తెలిసిందని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి తెలిపారు.

అవును అది వివేకా ఇళ్లే.. అయితే, ఆ రోజున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా అవినాష్‌కు మద్దతివ్వాలని ప్రభావతమ్మను వివేకా కోరినట్లు తెలిసిందన్నారు. హత్యకు ముందు రోజు మార్చి 13న శివశంకర్ రెడ్డి గూగుల్ టేకవుట్ లొకేషన్‌ను సీబీఐకి చూపించగా.. అది వివేకా ఇంటిదేనని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గుర్తించారు. సాధారణంగా శివశంకర్ రెడ్డి తమ ఇంటిలోకి ఎప్పుడూ రారని చెప్పారు. ఆ రోజున ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్ చేసి, వివేకానంద రెడ్డి పులివెందుల ఎప్పుడొస్తున్నారని ఆరా తీశారని.. తాము కడపలో ఉన్నట్లు చెప్పినట్లు నర్రెడ్డి వివరించారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని సాక్షిగా పేర్కొంటూ ఆయన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ.. గత నెల 30న అనుబంధ చార్జిషీట్‌తోపాటు కోర్టుకు సమర్పించింది.

Last Updated :Jul 23, 2023, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.