ETV Bharat / bharat

Kodi kathi case: సానుభూతి రావాలనే జగన్‌పై దాడి.. ఈ దాడి వెనక ఎవరున్నారు?

author img

By

Published : Apr 15, 2023, 8:14 AM IST

Updated : Apr 15, 2023, 1:01 PM IST

Kodi kathi attack case latest updates on Jagan: జగన్‌పై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో నిందితుడు శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేసిన ఘటనపై ఇంకా అనేక విషయాలు మిస్టరీగానే ఉన్నాయి. జగన్‌పై దాడి చేయడానికి గల కారణాలపై ఎన్‌ఐఏ దాఖలు చేసిన అఫిడివిట్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలు లభించినప్పటికీ.. ఈ దాడి వెనక ఉన్నది ఎవరు..?, ఉంటే వారెవరు..? అనే కోణాల్లో ఎన్‌ఐఏ సమగ్ర దర్యాప్తు చేస్తేనే అసలు గుట్టు బయటపడుతుందని రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

Kodi Katti case
Kodi Katti case

Kodi kathi attack case latest updates on Jagan: జగన్‌పై కోడికత్తితో దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా దాఖలు చేసిన అఫిడివిట్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలు లభించినా.. ఇంకా అనేక కీలకాంశాలు మిస్టరీగానే ఉన్నాయి. జగన్‌కు ప్రజల్లో సానుభూతి కల్పించేందుకే దాడి చేశానని, ఆయన సీఎం అవ్వాలనేదే తన ఉద్దేశమని నిందితుడు శ్రీనివాసరావు తన వాంగ్మూలంలో చెప్పారు. అయినా.. ఆయనంతట ఆయనే దాడి చేశారా..? దీని వెనుక జగన్‌ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనుకున్న శక్తులు, వ్యక్తుల ప్రోద్బలం ఏమైనా ఈ దాడి వెనుక ఉందా..? అనేది ఇంకా నిగ్గుతేలాలి. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తేనే అసలు గుట్టు బయటపడుతుంది.

జగన్‌ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడికి ముందు, ఆ తర్వాత చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాలను విశ్లేషిస్తే గనుక.. ఇప్పటికీ అనేక అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో అపోలో క్లినిక్‌ వైద్యురాలు డాక్టర్‌ కోట్యాడ లలిత స్వాతి.. జగన్‌కు ప్రథమ చికిత్స చేశారు. 0.5 సెంటీమీటర్ల పొడవు, 0.5 సెంటీమీటర్ల లోతున గాయమైనట్లు తేల్చి.. ఒక కుట్టు అవసరం పడొచ్చని చెప్పి.. డ్రసింగ్‌ చేసి కట్టు కట్టారు. జగన్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన తర్వాత ఆ గాయానికి డిబ్రిడ్మెంట్‌ చేపట్టారు.

దీంతో 3.5 సెంటీమీటర్ల లోతు, 1 సెంటీమీటర్‌ పొడవు, 0.5 సెంటీమీటర్ల పొడవున గాయం విస్తీర్ణం పెరిగింది. వైద్య అవసరాల రీత్యానే డిబ్రిడ్మెంట్‌ చేశారా..? మరేదైనా కారణం ఉందా..? అనేది నిగ్గు తేల్చాలి. సిటీన్యూరో సెంటర్‌లో తనకు చికిత్స అందించిన డాక్టర్‌ సాంబశివారెడ్డిని జగన్‌ అధికారంలోకి రాగానే.. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా, ఆ తర్వాత ఆరోగ్య శ్రీ ట్రస్టు వైస్‌ ఛైర్మన్‌గా నియమించారు.

మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌కు లబ్ధి కలిగించేందుకే ఆయనపై దాడి చేసినట్లు నిందితుడు శ్రీనివాసరావు వాంగ్మూలం ద్వారా తేలిపోయింది. అతను వైఎస్‌కి, ఆయన మరణించిన తర్వాత జగన్‌కు వీరాభిమాని అనే విషయం స్పష్టమైంది. జగన్‌కు ప్రజల్లో సానుభూతి కల్పించేందుకే కోడికత్తితో దాడి చేశానని, ఈ చర్య వల్ల జనమంతా జగన్‌కు ఓట్లేస్తారని తద్వారా ఆయన సీఎం అవ్వాలనేదే తన ఉద్దేశమని వాంగ్మూలంలో స్పష్టం చేశారు. దాడి సమయంలో నిందితుడు శ్రీనివాసరావు వద్ద లభించిన 11 పేజీల లేఖలో కూడా ఆయన అప్పటి సీఎం చంద్రబాబు పరిపాలనను తప్పుపడుతూ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తూ, జగన్‌పైన అభిమానం చాటుకుంటూ రాసిన అంశాలున్నాయి.

రేషన్‌ దుకాణాల్లో రేషన్‌ తీసుకోవాలంటే సామాన్య ప్రజలు రెండ్రోజుల పాటు కూలి పనులు మానుకోవాల్సి వస్తోందని, దివ్యాంగులు, వృద్ధులు పింఛన్లు తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారని రాశారు. వారికి అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా పింఛను అందే ఏర్పాట్లు చేయాలని లేఖలో ప్రస్తావించగా.. జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత పింఛను, రేషన్‌ ఇంటికే అందిస్తున్నారు. నిందితుడు శ్రీను.. తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా తన (జగన్) మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని, దీంతో తాను వెంటనే అప్రమత్తమై వెనక్కి వాలటంతో ఆ కత్తి తన ఎడమ భుజం పైభాగంలో గుచ్చుకుందని ఆనాడు జగన్‌ ఎన్‌ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేశారు.

ఈ నేపథ్యంలో కోడి కత్తి దాడి కేసుకు సంబంధించి కొందరు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల్లో ఆ విషయం ఎందుకు ధ్రువీకరణ అవ్వట్లేదు..? అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. జగన్‌పై దాడి జరిగిన వెంటనే నిందితుడు శ్రీనివాసరావును అక్కడున్న వైఎస్సార్సీపీ నాయకులు అతడిపై (నిందితుడి) దాడిచేస్తుంటే.. పెద్ద సీరియస్‌ ఏమీ కాదు. ఆ సమయంలో అతను (నిందితుడు) మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్నట్లు స్పష్టంగా కనిపించాడు.. ఆ క్రమంలోనే పోలీసులకు అతడిని అప్పగించండంటూ జగన్‌ పేర్కొన్నట్లు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల్లో తేటతెల్లమవుతోంది.

దాడి తర్వాత అదే జగన్‌.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌కు వెళ్లిన వెంటనే తనపై విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఆ మాటతో ఆనాడు రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. దీని వెనుక మర్మమేంటి..?, రక్తపు మరకలైన తన చొక్కాను ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించేందుకు ఆనాడు జగన్ ఎందుకు జాప్యం చేశారు..?, జగన్ తన ఎడమ భుజానికి గుచ్చుకున్న కోడి కత్తిని అందరిముందు కేఎన్‌ఆర్‌ లాగారని జగన్‌ చెప్పిన ఆ వాదన.. కొందరు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల వాదనతో ఎందుకు సరిపోలట్లేదు..? కోడి కత్తికి విషం ఉందేమోనన్న అనుమానంతో మెరుగైన చికిత్సను పొందడానికి జగన్‌ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌‌కు వెళ్లినట్లు అప్పట్లో వైఎస్సార్సీపీ నాయకులు ప్రకటించారు.

నిజంగా జగన్‌ది అదే భయమై ఉంటే వెంటనే విశాఖలోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి కదా..! ఒకవేళ ఆ కోడి కత్తికి నిజంగానే విషం ఉండుంటే హైదరాబాద్‌కు చేరేలోపే అది మరింత ప్రమాదకరంగా మారి ఉండేది కదా..!. 2018 అక్టోబరు 25వ తేదీ మధ్యాహ్నం పన్నెండున్నరకు జగన్‌పై కోడికత్తితో దాడి జరిగింది. అనంతరం అప్రమత్తమైన కొందరు వైఎస్సార్సీపీ నాయకులు ఆ కోడి కత్తిని వెంటనే బయటకు తీసుకెళ్లారు. తిరిగి పోలీసులు అడిగితే మధ్యాహ్నం రెండున్నరకు తీసుకొచ్చి అప్పగించారు. ఈ వ్యవధిలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.

అయితే, శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని మాత్రమే ఎన్‌ఐఏ తాజా అఫిడవిట్‌లో ప్రస్తావించింది తప్ప.. అతను జగన్‌ అభిమాని అనే విషయాన్ని అభియోగపత్రంలో పొందుపరచలేదు. కేవలం ఆయన వాంగ్మూలాన్నే అభియోగ పత్రానికి జతచేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావు ఇచ్చిన వాంగ్మూలాల్లో దాడి రోజున చెప్పిన అంశాలకే పరిమితం కాకుండా ఆ దాడి చేయడానికి అతడిని (నిందితుడిని) ఎవరైనా ప్రోత్సహించారా..? లేక అతడికి ఆలోచన కలుగజేసి కావాలనే ఆ దాడి చేయించారా..? అనే విషయాలు ఇంకా రాష్ట్ర ప్రజల్లో అనుమానాలుగానే మిగిలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దాడి వెనుక ఎవరి పాత్రైనా ఉందా..? ఉంటే వారెవరు? అనేది ఎన్‌ఐఏ నిగ్గుతేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్న ప్రధానాంశం.

ఇవీ చదవండి

Last Updated :Apr 15, 2023, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.