కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో నేను ఒకణ్ని కాను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Published : Mar 18, 2024, 4:34 PM IST
RS Praveen kumar Joins in BRS : కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం తనకు రావడం చాలా ఆనందంగా ఉందని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. తనను నమ్మి తనతో ప్రయాణించేందుకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణవాదం, బహుజనవాదం ఒక్కటేనన్నారు. సీఎం రేవంత్రెడ్డి తనను పాలమూరు బిడ్డ అంటూ ఒకవైపు తనను పొగడుతూనే మరోవైపు సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవిని తిరస్కరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒక్కరు కాలేడని, సీఎం రేవంత్రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్యాకేజీ తీసుకునే వాడిని అయితే అధికార పార్టీలో చేరేవాడినన్నారు. రేవంత్ రెడ్డి తన దారిన రాని వారిని బెదిరించే ప్రయత్నం చేయవద్దని, తన స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు.
మరోవైపు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వెళ్లే ముందు, ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రవీణ్ కుమార్ నివాళ్లు అర్పించారు. ఇటీవలే పొత్తుల విషయంలో మనస్తాపానికి గురైన ఆయన బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.