మంథనిలో గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసితుల ధర్నా - రోడ్డుపై బైఠాయింపు
Published : Mar 7, 2024, 9:05 PM IST
Highway Farmers Dharna at Manthani : పెద్దపల్లి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతన్నలు పోరుబాట పట్టారు. ఇవాళ మంథని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రహదారి భూసేకరణకు ఆదేశాలు ఎలా జారీ చేస్తారని అధికారులను ప్రశ్నించారు. మంథని ఆర్డీవోను కలిసి రహదారి సమస్యను విన్నవించుకునే క్రమంలో, ఆర్డీవోకు భూనిర్వాసితులను మధ్య మాటా మాటా పెరిగి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో రైతలు రోడ్డుపై బైఠాయించారు. ఆర్డీవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రహదారి నిర్మాణంతో తమ గ్రామానికి చెందిన 64 ఎకరాల భూమిని కోల్పోతున్నామని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం 20 నుంచి 30 లక్షల రుపాయలు విలువ గల భూమిని, రెండు లక్షల నష్టపరిహారం చెల్లించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మార్కెట్ ధర ప్రకారం తమ భూమికి పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.