ETV Bharat / bharat

ఆరు నెలలకు సరిపడా రేషన్​, డీజిల్​- పక్కా ప్లాన్​తో రైతుల ఆందోళనలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 2:31 PM IST

Updated : Feb 13, 2024, 2:50 PM IST

Farmers Protest Delhi 2024 : కనీస మద్దతు ధర కోసం చట్టం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దిల్లీ దిశగా పయనమైన రైతులకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రైతులు తమ ఆందోళనలను సుదీర్ఘంగా కొనసాగించేందుకు ప్రణాళిక రచించారని నిఘా వర్గాలు వెల్లడించాయి. అందుకోసం 6 నెలలకు సరిపడా రేషన్‌ను, డీజిల్‌ను రైతులు తమ వెంట తెచ్చుకున్నట్టు పేర్కొన్నాయి.

Farmers Protest Delhi 2024
Farmers Protest Delhi 2024

Farmers Protest Delhi 2024 : పలు డిమాండ్లతో దిల్లీలో ఆందోళనలకు బయల్దేరిన పంజాబ్, హరియాణా రైతుల గురించి కొత్త విషయం బయటకొచ్చింది. దిల్లీకి దారి తీసే అన్ని ప్రధాన మార్గాల్లో పోలీసులు బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడం వల్ల హస్తినలోకి వెళ్లేందుకు రైతులు ఓ ప్రణాళికతో ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. 'దిల్లీ చలో' మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నా ఆందోళనలను సుదీర్ఘంగా కొనసాగించేందుకు కర్షకులు సిద్ధమైనట్టు పేర్కొన్నాయి. అందుకోసం 6 నెలలకు సరిపడా రేషన్‌, ప్రయాణానికి కావాల్సిన డీజిల్‌ను తెచ్చుకున్నట్టు తెలిపాయి.

గుండు పిన్ను నుంచి సుత్తి వరకు
దిల్లీకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తే ప్రత్యామ్మాయ మార్గాల్లో నగరంలోకి ప్రవేశించాలని రైతులు ప్రణాళిక రచించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అందుకు సుదూర ప్రాంతాలను ఎంచుకున్నట్టు చెప్పాయి. నిఘా వర్గాలు తెలిపిన ఈ విషయాలు వాస్తవమేనని పలువురు రైతులు చెప్పినట్టు జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ వెంట గుండు పిన్ను నుంచి సుత్తి వరకు పనిముట్లు ఉన్నట్టు రైతులు తెలిపారని పేర్కొన్నాయి. పోలీసులు ఏర్పాటు చేసిన కాంక్రీటు దిమ్మెలు, బారికేడ్లు, ముళ్లకంచెలు తొలగించగలమని కర్షకులు చెప్పినట్టు తెలిపాయి.

గురుద్వారాలు, వాహనాలే ఇళ్లు
గతంలో కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు సుదీర్ఘంగా ఆందోళనలు చేసిన రైతులు మరోసారి నెలల పాటు నిరసన చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మార్గ మధ్యలో ఆశ్రయం కోసం గురుద్వారాలు, ఆశ్రమాల్లో తలదాచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. కొందరు రైతులు తమ వాహనాలను తాత్కాలిక ఆశ్రయం పొందేలా మార్పులు చేసుకున్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే హరియాణా, పంజాబ్ సరిహద్దుల్లో పలువురు రైతులను అడ్డుకున్న పోలీసులు, దిల్లీలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాక్టర్లు, ట్రాలీలతో వస్తున్న కర్షకులను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.

దిల్లీ సరిహద్దుల్లో అలర్ట్‌
రైతుల ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటుచేశారు. పలు చోట్ల కాంక్రీట్‌ బ్లాక్స్‌, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. దిల్లీ అంతటా నెల రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్‌ సమీపంలో ఉన్న సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.

రైతుల ఆందోళనలు ఉద్రిక్తం- డ్రోన్లతో టియర్ గ్యాస్ ప్రయోగం, ఎర్రకోట క్లోజ్​

కేంద్రంతో చర్చలు విఫలం- 'దిల్లీ చలో'కు రైతులు పిలుపు, ప్రభుత్వం అలర్ట్

Last Updated :Feb 13, 2024, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.