ETV Bharat / bharat

'MSPపై చట్టం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు- రైతులతో చర్చలకు సిద్ధమే'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 10:43 AM IST

Updated : Feb 13, 2024, 4:51 PM IST

Delhi Protest Farmers : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 'దిల్లీ చలో'కు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్​, హరియాణా రైతులు దిల్లీకి బయలుదేరారు. భారీగా ట్రాక్టర్లు, ట్రాలీలతో తరలివెళ్తున్నారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు రైతులను అడ్డుకున్నాయి.

Delhi Protest Farmers
Delhi Protest Farmers

  • 4.50PM
    కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ)పై చట్టం ఇప్పటికిప్పుడు తీసుకురావడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. సంబంధిత వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే చట్టం సాధ్యమవుతుందని చెప్పారు. చాలా వరకు రైతుల డిమాండ్లను తాము అంగీకరించామని తెలిపారు. ఎంఎస్​పీ గ్యారటీకి సంబంధించిన డిమాండ్​పై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

    మరోవైపు, ఆందోళన చేస్తున్న అన్నదాతలతో చర్చలు కొనసాగించేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని, అయినప్పటికీ రైతులు దిల్లీకి ర్యాలీగా వెళ్లడం సరికాదని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ అన్నారు. చర్చలను వ్యతిరేకిస్తూ దిల్లీకి వెళ్లడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. వేరే ఏదో ఉద్దేశం ఉండబట్టే రైతులు దిల్లీకి వెళ్తాలని పట్టుబట్టారని ఆరోపించిన ఆయన, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
  • 3.30PM
    జింద్ సరిహద్దులోనూ పంజాబ్ రైతులు, హరియాణా పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగిస్తున్నారు.
  • 3.00PM
    శంభు సరిహద్దులో 10 వేల మంది రైతులు ఉన్నట్లు రైతు సంఘం 'కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ' జనరల్ సెక్రెటరీ సర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు. రైతులంతా శాంతియుతంగానే ఉన్నారని చెప్పారు. తమపై డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగం చేపట్టారని వెల్లడించారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించేవరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
    మరోవైపు, పోలీసులు బాష్ప వాయుగోళాలు ప్రయోగిస్తున్న నేపథ్యంలో కొందరు రైతులు గ్యాస్ మాస్క్​లు ధరించి కనిపించారు.
  • 1.59 PM

హరియాణా, పంజాబ్ రైతులు శంభు సరిహద్దును దాటేందుకు ప్రయత్నించారు. వారు ట్రాక్టర్లతో సిమెంట్ బారికేడ్‌ను బలవంతంగా తొలగించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు, దేశ రాజధాని దిల్లీలో రైతుల నిరసనల నేపథ్యంలో ఎర్రకోటను మూసేశారు అధికారులు. అంతేగాక ఎర్రకోట సమీపంలో భద్రతను మరింత పెంచారు.

  • 01.20 PM

చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు కేంద్ర మంత్రి అర్జున్​ ముండా. రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు చర్చించామని, చండీగఢ్​కు వెళ్లి ప్రభుత్వాలతో చర్చించామని ఆయన తెలిపారు. కొందరు ఉద్రిక్తతలను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు.

  • 12.50 PM

పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దుల్లో రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. దీంతో సరిహద్దుకు చేరుకున్న రైతులు పరుగులు తీశారు. హరియాణా సరిహద్దు ప్రాంతంలో 11 కంపెనీల బలగాలు మోహరించారు. వీరిని చెదరగొట్టేందుకు డ్రోన్లతో టియర్ గ్యాస్​ను ప్రయోగించారు పోలీసులు.

  • 12.25 PM

గత 10ఏళ్లలో రైతులకు ఇచ్చిన హామీలను తీర్చకుండా, వారి గొంతును నొక్కుతున్నారంటూ ఆరోపించింది కాంగ్రెస్​. టియర్ గ్యాస్​, డ్రోన్లు, ముళ్ల కంచెలు పెట్టి, రైతులు నిరసన తెలపకుండా మోదీ అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు.

  • 12.10 PM

పంజాబ్​-హరియాణ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులపై టియర్​ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, రైతులకు మధ్య పెనుగులాట జరిగింది. అనేక మంది రైతులను అరెస్ట్ చేసి తరలించారు. రైతులు రాకుండా ఉండేందుకు ముళ్ల కంచెలు, కాంక్రీట్ స్లాబ్​లను అడ్డంగా పెట్టారు.

  • 12.00 PM

మరోవైపు బవానా స్టేడియంను తాత్కాలికంగా జైలు ఉపయోగించేందుకు కేంద్రం చేసిన ప్రతిపాదనను దిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులను అరెస్ట్ చేసి జైలులో వేయడాన్ని తాము అంగీకరించమని, ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు దిల్లీ హోంమంత్రి కైలాశ్ గహ్లోత్ లేఖ రాశారు. " రైతుల డిమాండ్ల న్యాయమైనవి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. రైతులను అరెస్ట్ చేయడం అన్యాయం" అని తెలిపారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో దిల్లీలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. ట్రాఫిక్​లో చిక్కుకున్న న్యాయవాదులకు తాను వసతి కల్పిస్తానని చెప్పారు.

  • 11.50AM

రైతులు దిల్లీలోకి ప్రవేశించకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. దిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దులోని అప్సర, పంజాబ్​-హరియాణాలోని శంబు సరిహద్దు వద్ద పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు రైతులు తమ ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని వడ్డించుకుని రోడ్డుపైనే తిన్నారు.

  • 11.20AM

రైతులు 'దిల్లీ చలో' కార్యక్రమానికి తరలివస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలోని ఎనిమిది మెట్రో స్టేషన్​లను మూసివేశారు అధికారులు. మరోవైపు రైతుల ఆందోళనలు తీవ్రతరమయ్యే క్రమంలో అరెస్ట్​ చేసే నిరసనకారులను తరలించేందుకు భావన స్టేడియాన్ని జైలులా మార్చేందుకు దిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం అనుమతి కోరింది. ఈ ప్రతిపాదనను కేజ్రీవాల్​ సర్కార్​ తిరస్కరించింది. దిల్లీలో రైతుల నిరసనల గురించి వీడియో కోసం ఈ లింక్​పై క్లిక్ చెయ్యండి.

Delhi Protest Farmers : 'దిల్లీ చలో'లో పాల్గొనేందుకు పంజాబ్, హరియాణా రైతులు బయలుదేరారు. భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, డీసీఎం, ట్రాలీలలో దేశ రాజధానివైపు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో దిల్లీ- హరియాణా సరిహద్దు వద్ద పోలీసులు, భద్రత బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహనాలపై వస్తున్న రైతులను శంభూ సరిహద్దు వద్ద అడ్డుకున్నాయి.

అంతకుముందు హరియాణా ప్రభుత్వం తమను వేధింపులకు గురిచేస్తోందని రైతు నాయకుడు, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్‌ పంధేర్‌ ఆరోపించారు. 'పంజాబ్​-హరియాణా సరిహద్దుల వద్ద మోహరించిన బలగాలను చూస్తుంటే, ఇదేమైనా ఇంటర్నేషనల్​ బోర్డర్​ లాగా అనిపిస్తుంది. మా ఆందోళనల ద్వారా రోడ్లను దిగ్భందిస్తామని మేము చెప్పలేదు. ప్రభుత్వమే ఆ పని చేస్తుంది' అని పంధేర్‌ అన్నారు.

Last Updated : Feb 13, 2024, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.