ETV Bharat / bharat

ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం- అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్​- అప్లై చేసుకోండిలా

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 4:01 PM IST

Updated : Feb 29, 2024, 5:22 PM IST

Cabinet Approves Rooftop Solar Scheme
Cabinet Approves Rooftop Solar Scheme

Cabinet Approves Rooftop Solar Scheme : కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్​ అందించే 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్​ బిజలీ యోజన' పథకానికి కేంద్ర కేబినెట్ ఆమెదం తెలిపింది. అంతేకాకుండా 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు పచ్చజెండా ఊపింది.

Cabinet Approves Rooftop Solar Scheme : కోటి గృహాలకు ఉచిత సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం​ తీసుకొచ్చిన 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజిలీ యోజన' పథకానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ పథకం కింద రూఫ్​టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కోటి కుటుంబాలకు ఆర్థిక సాయం లభిస్తుంది. కేబినెట్​ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ పొందగలుగుతారని వెల్లడించారు. ఇక పథకం కింద ఎంపికైన వారికి రూ.30వేలు(1kw రూఫ్​టాప్ సోలార్), రూ.60వేలు(2kw) చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందని చెప్పారు.

ఈ పథకానికి ఎవరు అర్హులు?
ఈ పథకం పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుతు ఉద్దేశించినది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, తక్కువ ఆదాయం కలిగినవారు ఈ పథకానికి అర్హులు. రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్​ హౌసింగ్​ సొసైటీ సభ్యులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అప్లై చేసుకోండిలా?
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు https://pmsuryaghar.gov.in/ వెబ్​సైట్​కు వెళ్లాలి. అక్కడ Apply For Rooftop Solar అనే ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలతో రిజిస్టర్ కావాలి. అనంతరం మీ మొబైల్​ నంబర్​తో లాగిన్ అయ్యి సోలార్​ రూఫ్​టాప్​ కోసం ఫామ్​ను నింపాలి. ఆ తర్వాత మీకు డిస్కంల నుంచి 'ఫీజిబిలిటీ అప్రూవల్' వస్తుంది. ఆ తర్వాత డిస్కంలలో రిజిస్టరైన సరఫరా దారుల ద్వారా మీరు సోలార్​ రూఫ్​టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్స్​స్టలేషన్ అయిపోయిన తర్వాత ప్లాంట్​ వివరాలను సమర్పించి నెట్​ మీటర్​ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్​ మీటర్​ వచ్చాక మీ రూఫ్​టాప్​ను డిస్కం అధికారులు తనిఖీ చేసి 'కమిషనింగ్ సర్టిఫికెట్' ఇస్తారు. అనంతరం ఆ సర్టిఫికెట్​తో పాటు క్యాన్సిల్​ చేసిన బ్యాంక్​ చెక్​బుక్​ను 'పీఎమ్​ సూర్యఘర్' పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలి. ఆ తర్వాత 30 రోజుల్లో మీ అకౌంట్లలో సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి.

3 సెమీకండక్టర్ ప్లాంట్లకు పచ్చజెండా
అంతేకాకుండా ఈ సమావేసంలో మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మాణాన్ని 100 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ బిగ్​ క్యాట్ అలయన్స్​(ఐబీసీఏ) ప్రధాన కార్యాలయాన్ని భారత్​లో ఏర్పాటు చేసుకునేందుకు కేబినెట్ గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. 2027-28 వరకు ఐదేళ్ల కాలానికి రూ.150 కోట్ల బడ్జెట్​కు కూడా ఆమోదం తెలిపింది.

ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీ
2024-25 ఖరీఫ్​ సీజన్​లో (ఏప్రిల్​ 1 - సెప్టెంబర్ 30) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి వివిధ పోషకాల కోసం ఎరువుల సబ్సిడీ రేట్లను (NBS) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎరువులపై సబ్సిడీ కోసం రూ.24,420 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) ఎరువుతో పాటు మిగతా ఫాస్ఫేటిక్, పొటషిక్ (పీ ఆండ్​ కే) ఎరువుల ధరల్లో మార్పులు ఉండవని తెలిపింది. డీఏపీ ఎరువును బస్తాకు పాత ధర రూ.1,350 మాత్రమే చెల్లించి తీసుకోవచ్చని వెల్లడించింది.

తాజా నిర్ణయంతో కిలో నత్రజనిపై రూ.47.02, కిలో ఫాస్ఫరస్​పై రూ.28.72, కిలో పొటాష్​పై రూ.2.38, కిలో సల్ఫర్​పై రూ.1.89 సబ్సిడీ లభించనుంది. 2023 రబీ సీజన్​తో పోలిస్తే ఫాస్ఫరస్​ రూ.20.82 నుంచి రూ.28.72కు పెరిగింది. మిగతా నత్రజని, పొటాష్, సల్ఫర్​ ధరల్లో మార్పు లేదు. ఇక ఎన్‌పీకే ఎరువు బస్తా రాయితీ ధర రూ.1470 లభించనుంది.

బ్యాలెట్ టు ఈవీఎం-75 ఏళ్ల ఎలక్షన్ కమిషన్ ప్రయాణం- ఆసక్తికర విషయాలివే!

క్రాస్ ఓటింగ్​కు పాల్పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షాక్- స్పీకర్ అనర్హత వేటు

Last Updated :Feb 29, 2024, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.