Rega KanthaRao provided bus facility to Shettipalli : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. పినపాక నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతంమైన శెట్టిపల్లి గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేక పలుమార్లు గుట్టల మీద నుంచే నడుచుకుంటూ వెళ్లానని ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. నాడు ఎన్నికల సమయంలో శెట్టిపల్లి గ్రామానికి రోడ్డు వేయించి బస్సులో వస్తానని ఇచ్చిన హామీ మేరకు.. కొత్తగూడెం మణుగూరు డిపోలకు చెందిన రెండు బస్సులలో ఇల్లందు మీదుగా శెట్టిపల్లి గ్రామానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు బయలుదేరారు. మారుమూల ప్రాంతాల్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ విస్తృత సేవలు అందిస్తుందన్నారు. నా ప్రయాణంలో ఆర్టీసీ సేవలు కూడా పరిశీలన చేస్తున్నానని.. బస్ సౌకర్యాన్ని గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
"శెట్టిపల్లి గ్రామానికి రహదారి లేదు. నేను గతంలో ఆ గ్రామానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. గుట్టలను ఎక్కి నడుచుకుంటూ వెళ్లాను. నాడు ఎన్నికల సమయంలో శెట్టిపల్లి గ్రామానికి రహదారి వేయించి.. బస్లోనే గ్రామానికి వస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రెండు బస్లతో శెట్టిపల్లి గ్రామానికి బయలుదేరాను. ఆర్టీసీ సంస్థ మారుమూల పల్లెలకు సేవలను అందించడం నిజంగా అభినందనీయం". - రేగా కాంతారావు, పినపాక ఎమ్మెల్యే