Bhadrachalam Godavari Water Level Today : రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా.. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. శనివారం 42.3 అడుగులకు చేరుకున్న నీటిమట్టం.. ప్రస్తుతం 43.3 అడుగులకు చేరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 43 అడుగులు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. మళ్లీ ఈరోజు ఉదయం గోదావరి నీటిమట్టం 43.3 అడుగులకు చేరి ప్రమాదక హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద నీరు వస్తున్నందున భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. రామాలయం ఏరియాలో.. కొత్త కాలనీ ఏరియాలో బ్యాక్ వాటర్ చేరకుండా అధికారులు మోటార్ల ద్వారా నీటిని తోడి బయటకు పంపిస్తున్నారు. కొత్త కాలనీ వద్ద కొంత వరద నీరు చేరడంతో సుమారు 28 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి కొంతమంది ప్రత్యేక అధికారులు వరద పరిస్థితిపై భద్రాచలంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో మాట్లాడుతూ అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.