తెలంగాణ

telangana

Mango Crop price in TS: మామిడి పంట ధర దిగాలు.. రైతన్న కుదేలు

By

Published : Apr 29, 2023, 1:18 PM IST

Mango Crop price in Telangana : అకాల వర్షాలతో మామిడి నేలరాలిపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతలను.. మార్కెట్‌ ధరలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. జగిత్యాల మామిడి మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా కిలో మామిడి ధర 10 నుంచి 25 రూపాయల మాత్రమే పలుకుతోంది. ఇంత తక్కువ ధర తమకు గిట్టుబాటు కూడా కావటంలేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Mango farmers
Mango farmers

మార్కెట్‌లో ధరలు లేక అల్లాడిపోతున్న మామిడి రైతులు

Mango Crop price in Telangana : జగిత్యాల జిల్లా మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లాలో సుమారు 38 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా 50 వేల టన్నుల దిగుబడి వచ్చేది. ఈసారి అకాల వర్షాలతోపాటు ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోయి 50శాతానిపైగా నష్టం వాటిల్లింది. దానికితోడు వడగళ్ల వర్షాలతో నల్లటి మచ్చలు రావటంతో నాణ్యత బాగా తగ్గిపోయింది.

"మామిడి ధరలు బాగా పడిపోయాయి. రెండు వర్షాలకు చాలా పంట నేలరాలింది. మిగిలింది మార్కెట్​కు తీసుకొచ్చి అమ్ముకుందామంటే ఇక్కడ ధరలు లేవు. మచ్చలు వచ్చిన కాయలు రూ.10పలుకుతుంటే.. మంచిగా ఉన్న కాయలు రూ. 20 పలుకుతున్నాయి. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.-" మామిడిరైతు, జిగిత్యాల

Mango Crop price in Jagtial: ఉన్న కొద్దిపాటి కాయలను మార్కెట్‌కు తెచ్చి అమ్ముకుందామంటే ధరలు పతనమయ్యాయి. గతేడాది కిలో మామిడి రూ.40 నుంచి 45 రూపాయలు పలకగా ఈసారి రూ.10 నుంచి 25 రూపాయాలకు మాత్రమే కొంటున్నారు. భారీగా తగ్గిన ధరలతో కనీసం పెట్టుబడి కూడా రావటంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో జగిత్యాల మామిడి మార్కెట్‌ అతిపెద్దది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్‌ సహా మిగతా రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి.

"కౌలు రైతులు బతికే పరిస్థితి లేదు. వడగళ్ల వర్షాలకు పంట బాగా దెబ్బతిన్నది. దానికి తోడు ఈదురు గాలులు వచ్చి పంట నేలవాలింది. మిగితా పంటను ఇక్కడకి తీసుకొచ్చి అమ్ముకుందామంటే ధరలు లేవు.. ఇక్కడ వ్యాపారస్థులు కూడా మోసం చేస్తున్నారు. ప్రభుత్వమే మా కౌలు రైతులను ఆదుకోవాలి"- కౌలు రైతు, జగిత్యాల

మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత సీజన్‌లో మార్కెట్‌ వెలవెలబోతోంది. ఉన్న కొద్దిపాటి కాయలను మార్కెట్‌కు తెస్తే వ్యాపారులు మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించాలని కోరుకుంటున్నారు.

Paddy crop losses due to rains: మూలుగుతున్న నక్కపై తాటిపండు పడినట్లు ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులపై వరుణుడు మళ్లీమళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేల ఎకరాల్లో యాసంగి వరి తడిసి ముద్దయింది. కోతకు వచ్చిన పంట నేల వాలింది. అక్కడక్కడ తడిచిన వరి ధాన్యం మొలకలు వచ్చాయి. దీంతో వాటిని కొనుగోలు చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. మరోవైపు వాతావరణ శాఖ కూడా మరో వారం రోజులు ఇలానే వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేయడంతో రైతు కన్నీటిపర్యంతం అవుతున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details