తెలంగాణ

telangana

వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలకు బెయిల్ మంజూరు

By

Published : Nov 29, 2022, 2:26 PM IST

Updated : Nov 29, 2022, 10:57 PM IST

Police Arrested YS Sharmila: వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలతో పాటు ఆరుగురికి నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మధ్యాహ్నం ప్రగతి భవన్​ వద్ద ఆందోళన నిర్వహించినందుకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రాత్రి 9 గంటల సమయంలో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు.

YS Sharmila
YS Sharmila

Police Arrested YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరైంది. రోజంతా నాటకీయ పరిణామాల మధ్య ఉత్కంఠగా సాగిన వ్యవహారం చివరకు బెయిల్​తో ముగిసింది. షర్మిలతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని సాయంత్రం వరకు ఎస్సార్ నగర్ పీఎస్​లో ఉంచి.. భారీ బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చారు. నాయమూర్తి ఎదుట షర్మిలను హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు. అంతకు ముందు విచారణ సమయంలో షర్మిలపై తప్పుడు కేసులు పెట్టారని షర్మిల తరఫు న్యాయవాదులు వాదించారు. శాంతియుత నిరసనకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని కోర్టులో ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి అరెస్ట్ చేసిన అందరికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. బెయిల్ రావడంతో.. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించిన షర్మిల లోటస్ పాండ్​కు తిరిగి వెళ్లిపోయారు.

వైతెపా అధ్యక్షురాలు షర్మిల నిన్న వరంగల్​ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో.. ప్రచారం రథంపై దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. ధ్వంసమైన కారులో షర్మిల ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ షర్మిల ప్రగతిభవన్‌ వైపు వెళ్తుండగా.. పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

ప్రగతిభవన్‌ ముట్టడికి షర్మిల యత్నం.. అరెస్టు చేసిన పోలీసులు

ఈ సందర్భంగా రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. పోలీసులు షర్మిలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. కారులోనే కూర్చుని ఉండిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు షర్మిలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సైతం చాలా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఆమెను కారులో నుంచి దించే ప్రయత్నం చేయగా.. కారు కిటికీలు మూసేసి ఎంతకూ బయటకు రాలేదు.

భవనం ఎక్కి వైతెపా కార్యకర్తల ఆందోళన: ఈ క్రమంలో కారుపై కూర్చుని వైతెపా కార్యకర్తలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. 15 మందికి పైగా వైతెపా కార్యకర్తలు, నేతలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ధ్వంసమైన కారు డ్రైవింగ్‌ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసుల క్రేన్‌ను తెప్పించి అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమెను కారులో నుంచి దించి స్టేషన్​లోకి తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఎస్‌.ఆర్. నగర్ పీఎస్ ఎదురుగా ఉన్న భవనం ఎక్కి వైతెపా కార్యకర్తల ఆందోళనకు దిగారు. భవనం ఎక్కి ఆందోళన చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

పలు సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు :వైఎస్ షర్మిలపై ఎస్.ఆర్​.నగర్ పోలీస్ స్టేషన్​లో ట్రాఫిక్​కి అంతరాయం కలిగించారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ 353, 333, 327తో పాటు వివిధ సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు అయ్యాయి. ఆమె అరెస్టు అయిన విషయం తెలుసుకున్న వైఎస్సార్​టీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల అరెస్టు అయిన విషయం తెలుసుకున్న ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూతురిని పరామర్శించడానికి ఎస్​.ఆర్.నగర్ పోలీస్​ స్టేషన్​కి బయలుదేరారు. కానీ విజయమ్మను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

షర్మిల ఫైటర్, తగ్గేదేలే :షర్మిల అరెస్టు అయిన విషయం తెలుసుకున్న ఆమె భర్త బ్రదర్ అనిల్ ఎస్​.ఆర్.నగర్ పోలీస్​స్టేషన్​కు వచ్చారు. పీఎస్​ లోపలికి వెళ్లి వైఎస్ షర్మిలను పరామర్శించారు. వైతెపా వాహనాలను ధ్వంసం చేసిన వారిపై కేసు పెట్టలేదని బ్రదర్‌ అనిల్‌ ఆరోపించారు. బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని... కేసులపై న్యాయపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు.

'షర్మిల ఫైటర్, తగ్గేదేలే. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. వైతెపా వాహనాలను ధ్వంసం చేసిన వారిపై కేసు పెట్టలేదు. బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారు. కేసులపై న్యాయపరంగా పోరాడుతాం. షర్మిలపై పెట్టిన సెక్షన్లలో ఒక్కటైనా రుజువు చేస్తారా?'- బ్రదర్‌ అనిల్‌, షర్మిల భర్త

పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు: బ్రదర్‌ అనిల్‌

ఇవీ చదవండి:

Last Updated :Nov 29, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details