తెలంగాణ

telangana

ప్రమాదాల నివారణకు ఆర్టీసీ 'ఐ రాస్తే' అస్త్రం.. ఇక నో యాక్సిడెంట్స్​!

By

Published : Sep 19, 2022, 8:15 AM IST

iRASTE project in Telangana : నిత్యం ఆర్టీసీ బస్సులు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని బస్సులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్టీసీ సంస్థ ఏటా రూ.కోట్లు పరిహారం చెల్లిస్తోంది. అందుకే రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సహకారంతో ముందడుగులు వేస్తోంది. ప్రమాదాలను ముందే పసిగట్టే సాంకేతికతను అందిపుచ్చుకుని బస్సుల్లో వినియోగిస్తోంది. ఇటువంటి కొత్త సాంకేతికతను అమలు చేస్తున్న ఆర్టీసీపై ప్రత్యేక కథనం..

iRASTE project in Telangana
iRASTE project in Telangana

ప్రమాదాల నివారణకు ఆర్టీసీ 'ఐరాస్తే' అస్త్రం.. సక్సెస్​ అయితే ఇక నో యాక్సిడెంట్స్​!

iRASTE project in Telangana : ఆర్టీసీ బస్సులు నిత్యం రహదారులపై తిరుగుతుంటాయి. డ్రైవర్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఎదురుగా వస్తున్న వాహనాల తప్పిదాల వల్ల ఆర్టీసీ బస్సులకు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ప్రమాదాలు నివారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సహకారంతో ఇంటెలిజెంట్ సొల్యూషన్​ ఫర్​ రోడ్​ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ అనే ఐరాస్తే ప్రాజెక్టును విస్తరిస్తోంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఇంటెల్​ సంస్థ సంయుక్తంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేశాయి.

iRASTE project in Telangana News : ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్లపై ప్రమాదాలు నివారించేందుకు ఆర్టీసీ బస్సుల్లో.. సెన్సార్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి కృత్రిమ మేథ, మిషన్​ లెర్నింగ్​ సాంకేతికత ఆధారంగా పని చేస్తాయి. బస్సులో ఉన్న సెన్సార్లు ప్రమాద కారకాలను గుర్తించి ట్రిపుల్ ఐటీలోని కంట్రోల్​ సెంటర్​కు సందేశాలు పంపుతాయి. బస్సు అతివేగంతో ప్రయాణిస్తున్నా.. ముందున్న వాహనాలకు మరీ దగ్గరగా వెళ్లినా, రోడ్ల పరిస్థితి సరిగా లేకున్నా, రోడ్డు మార్జిన్​ పాటించకపోయినా డ్రైవర్​ను అప్రమత్తం చేసేలా సెన్సార్లు సిగ్నల్స్ ఇస్తాయి. దీనివల్ల బస్సును నియంత్రించి ప్రమాదాలు తప్పించేందుకు వీలవుతుంది. ప్రమాదాలూ తగ్గుతాయి.

సంస్థకు తగ్గనున్న భారం.. ఈ ఏడాది జులై 12న మంత్రి కేటీఆర్ ఐరాస్తే ప్రాజెక్టును ప్రారంభించారు. తొలి విడతలో 20 బస్సులకు ఈ సాంకేతికతను అమలు చేయగా.. మంచి ఫలితాలు వస్తుండటంతో మరిన్ని బస్సులకు విస్తరిస్తున్నారు. ప్రస్తుతం 80 బస్సుల్లో ఈ సాంకేతికతను ప్రారంభించారు. ఈ నెలఖారుకి మరో 120 బస్సుల్లో సెన్సర్లు, సీసీ కెమెరాలు అమర్చనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్టీసీ సంస్థ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఏటా రూ.50 కోట్ల వరకు పరిహారం చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల సంస్థకు భారం తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ రూట్లలో తిరిగే బస్సుల్లో..: ఈ ఐరాస్తే ప్రాజెక్టును ఇప్పటికే నాగ్​పూర్​లోని బస్సుల్లో అమలు చేయడంతో అక్కడ ప్రమాదాలు కూడా నియంత్రణలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో.. హైదరాబాద్​ నుంచి విజయవాడ, బెంగళూరు రూట్లలో తిరిగే బస్సుల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details