తెలంగాణ

telangana

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

By

Published : Mar 27, 2023, 7:09 AM IST

Supreme Court on MLC Kavitha Petition : నేడు సుప్రీంకోర్టులో బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు రానుంది. దిల్లీ లిక్కర్ స్కామ్​లో తనకు జారీ చేసిన ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కవిత పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ కేసును విచారణ చేయనుంది.

Supreme Court
Supreme Court

Supreme Court on MLC Kavitha Petition : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ.. బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ బేలా ఎమ్​ త్రివేదీల ధర్మాసనం ఈ కేసును విచారణ చేయనుంది. కవితతో పాటు వైఎస్సార్​సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చెందిన బినామీలు అరుణ్‌ రామచంద్రపిళ్లై, ప్రేమ్‌ రాహుల్‌.. సౌత్‌ గ్రూపు ద్వారా ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు చెల్లించి.. మద్యం విధానాన్ని అనుకూలంగా మలచుకున్నారని ఈడీ అభియోగం మోపింది.

దీనిపై ఈ నెల 11న తొలిసారి కవితను విచారించిన ఈడీ.. 16 మరోసారి హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. మహిళలను చట్ట ప్రకారం కార్యాలయాల్లో విచారణ చేయకూడదని కవిత సుప్రీంలో అత్యవసర విచారణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ ధర్మాసనాన్ని కోరారు.

ఆ రెండు అంశాలను విచారించనున్న సుప్రీంకోర్టు : అయితే అందుకు తిరస్కరించిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం.. ఈ నెల 24 విచారిస్తామని పేర్కొంది. అప్పుడు విచారణ జరగలేదు. 27 నాటికి జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేది న్యాయస్థానం ముందు లిస్ట్ చేశారు. ఇప్పటికే ఈడీ దీనిపై కెవియట్‌ దాఖలు చేసింది. ఈ రెండు అంశాలను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.

ఈడీకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత : ఈ నెల 20న ఈడీ విచారణకు రెండోసారి హాజరైన కవితను ఆ రోజు 10 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. తదుపరి రోజు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో వరుసగా రెండో రోజు మార్చి 21న విచారణకు హాజరైన ఆమెను దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు. అంతకుముందు కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖ రాశారు. ఈడీ దర్యాప్తునకు సంబంధించి వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని ఆమె లేఖలో వెల్లడించారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈడీ ఆరోపించిన పది ఫోన్లను ఐఎంఈఏ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లుగా కవిత తెలిపారు. మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మొబైల్ ఫోన్లను కోరారని.. అయినప్పటికీ తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details