తెలంగాణ

telangana

ఆ అంశంపై సీఎం కేసీఆర్​కు మరో లేఖ రాసిన కిష‌న్ రెడ్డి..

By

Published : Mar 16, 2023, 4:49 PM IST

Central Minister Kishan Reddy Wrote letter to CM KCR: కేంద్ర ప‌ర్యాట‌క‌, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిష‌న్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్​కు మ‌రోసారి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో నూత‌నంగా నిర్మించ‌నున్న జాతీయ ర‌హ‌దారుల‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వెంట‌నే పూర్తి చేసి నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని అందులో పేర్కొన్నారు.

Kishan Reddy
Kishan Reddy

Central Minister Kishan Reddy Wrote letter to CM KCR: తెలంగాణ‌లో నూత‌నంగా నిర్మించ‌నున్న జాతీయ ర‌హ‌దారుల‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిష‌న్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. భారతమాల పరియోజన ప‌థ‌కం కింద జాతీయ ర‌హ‌దారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి కావాల్సిన భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసి రహదారుల నిర్మాణానికి సహకరించాలని అందులో కోరారు.

National Highways in Telangana: 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించే నాటికి రాష్ట్రంలో 2,500 కి.మీల పొడ‌వున జాతీయ రహ‌దారుల నిర్మాణం జ‌రిగింద‌న్నారు. 2014 త‌ర్వాత నుంచి నేటి వరకు అంటే ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే మరో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను నిర్మించామ‌న్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలుపుతుందని వివ‌రించారు.

ఆ 11 ప్రాజెక్టులకు భూమి కావాలి:ఇవే కాకుండా రాష్ట్రంలో మరో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయన్నారు. అందులో రూ.32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి 4,332 హెక్టార్ల భూమి అవసరం ఉందని.. ఈ భూమి సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు అనేక సార్లు లేఖలు రాశార‌న్నారు.

అయినప్పటికీ.. ఇప్పటి వరకు 284 హెక్టార్ల భూమిని మాత్రమే జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్ప‌గించింద‌న్నారు. ఇంకా 4,048 హెక్టార్ల భూమిని స్వాధీనం చేయాల్సి ఉంద‌న్నారు. ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టుల వివరాలను ఈ లేఖకు అనుబంధంగా సీఎంకు పంపిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం వ్యక్తిగతంగా చొరవ చూపించి, ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టులకు కావాల్సిన భూమిని సకాలంలో అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయటానికి వీలుగా త‌గిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజన అనే ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న ఈ ప‌థ‌కాన్ని ర‌హ‌దారి నెట్ వ‌ర్క్ మెరుగుప‌ర‌చ‌డం, దేశ వ్యాప్తంగా స‌ర‌కు ర‌వాణాలో వేగం పెంచ‌డం, ట్రాఫిక్​ను త‌గ్గించ‌డం వంటివి చేయ‌డానికి రూపొందించారు. దీంతో పాటు ఆర్థిక కారిడార్లు, పోర్టు క‌నెక్టివిటీ రోడ్లు, స‌రిహ‌ద్దు రోడ్ల‌ను అభివృద్ధి చేయాల‌ని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details