తెలంగాణ

telangana

బిడ్డను బతికించాలనుకుంది.. చివరికి తానే మరణించింది

By

Published : Jan 17, 2023, 9:35 AM IST

Woman suicide in Kukatpally: కాపాడాల్సిన కంటిరెప్పలే కాటేయాలని చూస్తుంటే ఆమెకు దిక్కుతోచలేదు. మానసిక వికలాంగుడైన కుమారుడిని కాపాడుకునేందుకు భర్త, అత్తమామలతో చేసిన పోరాటంలో అలసిపోయిన ఆ తల్లి చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఆ చిన్నారికి ఇన్నాళ్లు అండగా నిలిచిన ఆ తల్లే అతడిని వదిలేసి వెళ్లిపోయింది. కన్నీరుపెట్టించే ఈ ఘటన హైదరాబాద్‌..కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

స్వాతి
స్వాతి

Woman suicide in Kukatpally: కన్నకొడుకును వదిలించుకుందామని భర్తే అన్నప్పుడు నమ్మలేకపోయింది. మానసిక వికలాంగుడైనంత మాత్రాన అలా ఎలా చేస్తామని ప్రశ్నించింది. కాదు..కూడదనడంతో కాళ్లా వేళ్లాపడింది. అత్తమామలూ భర్తకు తోడై వేధించినా తగ్గలేదు. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డకు అన్నీ తానై పెంచుకుంటానని, చికిత్స చేయిస్తానని ఎంత చెప్పినా ఆ పాషాణ హృదయులు కనికరించలేదు. బిడ్డను చంపేస్తారన్న భయంతో.. క్షణక్షణం నరకయాతన అనుభవించి..చివరికి తానే బలవన్మరణానికి పాల్పడింది ఓ తల్లి. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్ కేపీహెచ్​బీలో చోటుచేసుకుంది.

సీఐ కిషన్‌కుమార్‌ వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శ్రీధర్‌కు, అదే జిల్లా సర్పవరం ప్రాంతానికి చెందిన రామ వెంకటలక్ష్మి గణపతు స్వాతికి 2013లో వివాహమైంది. వీరు కేపీహెచ్‌బీ పరిధిలోని మంజీరా మెజెస్టిక్‌ హోమ్స్‌లో ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల వయసు బాబు ఉన్నాడు. అతను మానసిక వికలాంగుడు. దీంతో శ్రీధర్‌తోపాటు అతని తల్లిదండ్రులు బాబును ఎలాగైనా వదిలించుకోవాలని స్వాతిపై ఒత్తిడి తెచ్చేవారు.

పలుమార్లు అనాథ శరణాలయంలో వదిలేద్దామనేవారు. స్వాతి ససేమిరా అనడంతో వారి వేధింపులు తీవ్రమయ్యాయి. మరోవైపు బాబుకు చికిత్స అందించేందుకు స్వాతి పుట్టింటివారి సాయం తీసుకుంది. ఇది జీర్ణించుకోలేని అత్తింటివారు మరింత వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఆ వేధింపులు తాళలేక స్వాతి (36) ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఆదివారం సంక్రాంతి రోజు రాత్రి 9.30 గంటలకు అపార్ట్‌మెంట్‌ 23వ అంతస్తుకు వెళ్లింది. అక్కడి నుంచి 22వ అంతస్తుకు వచ్చి అక్కడి నుంచి దూకేసింది. ఆమె శరీరం మొదటి అంతస్తు కారిడార్‌లో పడటంతో తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమ కుమార్తె బలవన్మరణానికి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త కారణమంటూ స్వాతి తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ అయిదుగురిపై కేసు నమోదైంది.

మూడేళ్ల వరకు బాబును చూడలేదు:స్వాతి సోదరుడు హేమంత్‌

స్వాతికి వివాహం చేశాక మూడేళ్ల తర్వాత వారికి బాబు పుట్టాడు. మానసిక వైకల్యం ఉండటంతో మా బావ శ్రీధర్‌తోపాటు అతని తల్లిదండ్రులు మూడేళ్ల వరకు చూడటానికి రాలేదు. అసలు ఆ బాబు వద్దని, వదిలించుకుందామని, ఎక్కడైనా విడిచిపెడదామని, మరొకరిని కందామని స్వాతిపై ఒత్తిడి తెచ్చేవారు. దీంతో అతనిపై కేసు పెట్టడంతో పోలీసులు పిలిపించి మాట్లాడారు. బాబును, అక్కను బాగా చూసుకుంటానని చెప్పడంతో పంపించాం. ఆదివారం అక్కకు ఫోన్‌ చేసి పండగ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే స్విచాఫ్‌ వచ్చింది. శ్రీధర్‌ మాకు ఫోన్‌ చేసి అక్కకు దెబ్బలు తగిలాయని చెప్పడంతో చూద్దామని వస్తే ఆమె ప్రాణాలతో లేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details