తెలంగాణ

telangana

ఉరి బిగించాడు.. ఉత్తుత్తినే ఏడ్చాడు!

By

Published : Apr 17, 2021, 6:47 AM IST

జీవితాంతం కాపాడాల్సిన చేతులే కాటేశాయి. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమార్తెను ఓ కర్కశ తండ్రి కడతేర్చాడు. భార్య మీద కోపంతో... మూడేళ్ల చిన్నారిని ఉరిబిగించి చంపాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

FATHER KILLS DAUGHTER
ఉరి బిగించాడు.. ఉత్తుత్తినే ఏడ్చాడు!

భార్యమీద కోపంతో కన్నతండ్రే కుమార్తెను ఉరిబిగించి చంపాడు. ఏమీ ఎరగనట్టు ఏడుస్తూ బాధను నటించాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో గురువారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే?

ఒడిశాకు చెందిన అరుణ్‌ హరిజన్‌, కీరోదీప్‌ దంపతులు నాలుగు నెలల కిందట పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట సమీపంలోని ఇటుకబట్టీలో పనికి కుదిరారు. అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వారికి కుమారుడు సాగర్‌, కుమార్తె హెలినా(3) ఉన్నారు. ఇక్కడికి రాకమునుపు ఒడిశాలో ఉన్న తన భార్య సోదరులు, బంధువులతో అరుణ్‌ ఘర్షణపడ్డాడు. వాటిని మనసులో పెట్టుకుని భార్యతో నిత్యం గొడవ పడేవాడు.

వద్దన్నా పనికి వెళ్లిందనే కోపంతో

గురువారం పనికి వెళ్లేందుకు సిద్ధమైన భార్యతో మరోసారి ఘర్షణ పడ్డాడు. పనికి వెళ్లొద్దని ఆమెను కోరాడు. అతని మాట వినకుండా పనికి వెళ్లడంతో కోపంతో రగిలిపోయాడు. ఆమె ఇష్టంగా చూసుకునే హెలినాను చంపడం ద్వారా కసి తీర్చుకోవాలని భావించాడు. మెడచుట్టూ తాడు బిగించి చంపాడు. కూతురికి జ్వరమొచ్చి పడుకుందని పక్కనే ఉన్న కుటుంబాల వారిని నమ్మించాడు. సాయంత్రం పనినుంచి వచ్చిన తల్లి అచేతనంగా పడిఉన్న బిడ్డను చూసి రోదించింది. అరుణ్‌ కూడా ఆమెతోపాటే ఏడుస్తూ బాధను నటించాడు. పాప మెడ చుట్టూ తాడు బిగించిన ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పలువురు అనుమానితులతో పాటు తండ్రినీ విచారించారు. నేరం అంగీకరించడంతో శుక్రవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:వాగులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

ABOUT THE AUTHOR

...view details