తెలంగాణ

telangana

మరోసారి గోదావరి ఉగ్రరూపం.. జల దిగ్బంధంలో లంక గ్రామాలు

By

Published : Sep 14, 2022, 10:29 PM IST

Godavari Floods in ap: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భారీ ఎత్తున వస్తున్న వరదతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.20 అడుగులకు నీటిమట్టం చేరగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విలీన మండలాలు, లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

మరోసారి గోదావరి ఉగ్రరూపం.. జల దిగ్బంధంలో లంక గ్రామాలు
మరోసారి గోదావరి ఉగ్రరూపం.. జల దిగ్బంధంలో లంక గ్రామాలు

మరోసారి గోదావరి ఉగ్రరూపం.. జల దిగ్బంధంలో లంక గ్రామాలు

Godavari Floods In AP: ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ఉద్ధృతికి విలీన మండలాలు మరోసారి వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఎటపాక, కూనవరం, వీఆర్​పురం, చింతూరు మండలాలకు వరద పోటెత్తింది. వీఆర్​పురం, చింతూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రహదారులు నీట మునిగాయి. ఈ సీజన్‌లో మూడోసారి గోదావరి నదికి వరదలు రావడంతో.. పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి సముద్రంలోకి, పంట కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమ ప్రాంతంలోని నదీ పాయల్లో ప్రవాహ ఒరవడి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదలడంతో గౌతమి, వశిష్ఠ, వైనతేయ.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ లంకలు మరోసారి ముంపులో చిక్కుకున్నాయి.

అల్పపీడన ప్రభావంతో కోనసీమ ప్రాంతంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురం సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నిండా మునిగాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ముంచుకొచ్చిన గోదావరి వరద కలిసి.. కోనసీమ లంకగ్రామాల ప్రజల కష్టాలను రెట్టింపు చేశాయి. జన జీవనం పూర్తిగా స్తంభించింది. ముమ్మిడివరం మండలం పరిధిలోని 8 లంక గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. రహదారులు నీట మునిగి.. నాటు పడవలపైనే జనం రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరి తోటల్లో కాయలు వరదకు కొట్టుకుపోకుండా రైతులు ఒడ్డుకు చేర్చుకుంటున్నారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాటికాయలవారిపాలెం సమీపంలోని జిల్లేడు లంక వద్ద వరద ప్రవాహంలో చిక్కుకొని ఒక రైతు గల్లంతయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజు పాలేనికి చెందిన కౌలు రైతు జవ్వాది నరసింహారావు.. జిల్లేడు లంకలో పదేళ్లుగా లంక భూమిలో తమలపాకు సాగు చేస్తున్నారు. జూలైలో వచ్చిన వరద.. పంటను తుడిచిపెట్టేసింది. పొలంలో ఉన్న కలపను జాగ్రత్త చేసేందుకు వెళ్తుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. భద్రాచలం వద్ద వరద తగ్గుతున్నప్పటికీ.. ఏపీలో మాత్రం మరో రెండో రోజుల పాటు వరద ఉద్ధృతి నిలకడగా కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..:

ప్రభాస్‌ను కలవనున్న కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా..

క్రికెట్​కు గుడ్​బై చెప్పిన స్టార్ క్రికెటర్​

ABOUT THE AUTHOR

...view details