తెలంగాణ

telangana

కానిస్టేబుల్స్​ టు IPS.. ఇద్దరు వీరవనితల విజయ ప్రస్థానం

By

Published : Jun 21, 2023, 3:46 PM IST

కానిస్టేబుల్​గా ఉద్యోగంలో చేరిన ఇద్దరు మహిళలు.. ఐపీఎస్​లుగా మారబోతున్నారు. అటు ఉద్యోగంతో పాటు.. ఇటు ఉన్నత విద్యను కొనసాగిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. వారి కథేంటో తెలుసుకుందాం రండి.

two female constables become IPS soon in Jharkhand
two female constables become IPS soon in Jharkhand

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నా.. కనీసం కాళ్లకు వేసుకోవడానికి షూ కూడా లేవు. అలాంటి కఠిన పరిస్థితులను సైతం దాటుకుని వచ్చారొకరు. క్రీడలపై ఆసక్తితో ఏదైనా సాధించాలని అనుకున్నారు మరొకరు. తమ ప్రతిభతో అనేక పతకాలను సాధించారు వీరిద్దరు. స్పోర్ట్స్​​ కోటాలో కానిస్టేబుల్​ ఉద్యోగాన్ని సైతం సంపాదించారు. అటు ఉద్యోగంతో పాటు ఇటు ఉన్నత విద్యను కొనసాగిస్తూ.. అంచెలంచెలుగా ఎదిగారు. కానిస్టేబుల్​గా మొదలు పెట్టిన వీరు.. ఇప్పుడు ఐపీఎస్​లుగా మారబోతున్నారు. వీరి విజయ ప్రస్థానం తెలుసుకుందాం రండి..

ఝార్ఖండ్​కు చెందిన ఇద్దరు మహిళలు ఐపీఎస్​లుగా మారబోతున్నారు. స్పోర్ట్స్​ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించిన వీరు.. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఏకంగా ఐపీఎస్​ పదవినే పొందబోతున్నారు. ఝార్ఖండ్ రాష్ట్ర పోలీసుశాఖకు చెందిన వీరిని ఐపీఎస్​లుగా పదోన్నతి ఇవ్వాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్​కు లేఖ రాసింది రాష్ట్రం. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 24 మంది అధికారులకు పదోన్నతి కల్పిస్తూ జూన్​ 19న నిర్ణయం తీసుకుంది యూపీఎస్​సీ. వీరిలో సరోజిని లఖ్డా, ఎమెల్డా ఎక్కా అనే ఇద్దరు క్రీడాకారిణులు ఉన్నారు. వీరిద్దరూ 1986లో స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారు. సర్వీసులో చేరిన తర్వాత తమ ఉన్నత చదువులను కొనసాగించారు. తాజాగా యూపీఎస్​సీ నిర్ణయంతో ఐపీఎస్​గామారనున్నారు.

జర్మనీలో ఎంఏ పూర్తి
లాతేహర్​ జిల్లాలోని రామ్​సెలీ గ్రామానికి చెందిన సరోజిని లఖ్డాకు చిన్ననాటి నుంచి క్రీడలంటే ఆసక్తి. మహూఅడాండ్​లోని సెయింట్ థెరిసా స్కూల్​లో చదువుకున్న ఆమె.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించారు. 1984లో దిల్లీలో జరిగిన ఎస్​డీఎఫ్​ఐ గేమ్స్​లో జావెలిన్​ త్రో విభాగంలో మొదటి పతకాన్ని సాధించారు. 100మీ హర్డల్స్​, 100, 400 మీటర్ల రిలేతో పాటు హై జంప్​, లాంగ్​ జంప్​, హెప్టాథ్లాన్​ పోటీలో అనేక మెడల్స్​ పొందారు. 1994 నుంచి ఇప్పటివరకు ప్రతి ఇండియన్ పోలీస్​గేమ్స్​లో ఈమె పాల్గొంటూనే ఉన్నారు. 2018లో జర్మనీలో ఒలింపిక్​ స్టడీస్​లో ఎంఏను పూర్తి చేశారు.

షూ కూడా లేవు!
మహూఅడాండ్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని చైన్​పుర్​కు చెందిన ఎమెల్డా ఎక్కా కూడా 1986లోనే స్పోర్ట్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందారు. ఎక్కా.. జాతీయ స్థాయి పోటీల్లో ఉమ్మడి బిహార్​ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 100, 200, 400 మీటర్ల రిలే పోటీల్లో అనేక పతకాలను సాధించారు. ఈ పోటీల సమయంలో కనీసం ఆమెకు వేసుకోవడానికి షూ కూడా లేవు.
1991లో ఒకేసారి ఇన్​స్పెక్టర్లుగా పదోన్నతి పొందారు సరోజిని, ఎమెల్డా. ఆ తర్వాత 2008లో డీఎస్​పీగా.. 2019లో ఎఎస్​పీగా ప్రమోషన్​ పొందారు.

ఇవీ చదవండి :అప్పుడు ఇంగ్లిష్​ ఫెయిల్​ స్టూడెంట్.. ఇప్పుడు పవర్​ఫుల్​ IPS​ ఆఫీసర్!

Woman IPS Officers: వీరవనితలు.. అందుకే ఐపీఎస్​ అయ్యారు..

ABOUT THE AUTHOR

...view details