తెలంగాణ

telangana

ఒమిక్రాన్ భయాలు- దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబానికి కరోనా

By

Published : Dec 3, 2021, 9:47 AM IST

Updated : Dec 3, 2021, 10:37 AM IST

Rajasthan Omicron suspected: దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల ​ జైపుర్​కు వచ్చిన ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. వారికి ఒమిక్రాన్​ వేరియంట్​ సోకిందేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి వద్ద నుంచి సేకరించిన నమూనాలను జన్యు పరీక్షల కోసం పంపారు.

Rajasthan Omicron suspected family
రాజస్థాన్​లో ఒమిక్రాన్​

Rajasthan Omicron suspected: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ కేసులు భారత్​లో బయటపడ్డాయి. కర్ణాటక బెంగళూరులో ఇద్దరికి ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. ​ఇప్పుడు రాజస్థాన్​ జైపుర్​లో కూడా ఒమిక్రాన్ వ్యాపించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల జైపుర్​కు వచ్చిన ఓ కుటుంబానికి కరోనా సోకినట్లు నిర్ధరణ కావడమే ఇందుకు కారణం.

"జైపుర్​లోని దాదీ కా ఫాటక్​ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులు కొవిడ్ బారినపడ్డారు. వారంతా ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి భారత్​కు తిరిగివచ్చారు. వారికి ఒమిక్రాన్ వేరియంటే సోకిందా అన్నదానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. వారి నమూనాలను జన్యుపరీక్షల కోసం పంపించాం. ప్రస్తుతం ఆ కుటుంబం ఐసొలేషన్​లో ఉంది. వారితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నాం."

-అధికారులు

Omicron india: కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని అన్నారు. వీరిద్దరికీ తొలుత కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ కావడం వల్ల ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశామని, వారిద్దరిలో ఒమిక్రాన్‌ ఉన్నట్టు ఇన్‌సాకాగ్ నిర్ధరించినట్లు వెల్లడించారు. బాధితుల్లో తీవ్ర లక్షణాలు కనిపించలేదని తెలిపారు.

ఇదీ చూడండి:Omicron India News: ఆ ఎనిమిది మందికి కరోనా.. ఒమిక్రాన్​ భయంతో...

ఆ 9 మందికి కరోనా..

Coronavirus international travellers: విదేశాల నుంచి నవంబరు 10 నుంచి డిసెంబరు 2 మధ్య ముంబయి అంతర్జాతీయ విమానాలకు వచ్చిన 9 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధరణ అయింది. ఆ 9 మందిలో ఒకరు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి కావడం గమనార్హం. వారి నమూనాలను జన్యుపరీక్షల కోసం పంపించినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

కేంద్రం అప్రమత్తం..

'ఒమిక్రాన్‌' ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుండటం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని పేర్కొంది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వివిధ విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నవారిపై సమర్థ నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు మంగళవారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చాయి. ఐరోపా సమాఖ్య సభ్య దేశాలు, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌ను 'ముప్పు' దేశాలుగా పేర్కొంటూ కేంద్రం ఇప్పటికే జాబితా విడుదల చేసింది.

ఒమిక్రాన్​ వేరియంట్​ను తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ రకం వైరస్​.. వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరించారు. ఒమిక్రాన్​ను తీవ్రంగా పరిగణించాలని డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:Omicron worldwide: ఒమిక్రాన్‌.. ఏ దేశంలోకి ఎప్పుడు?

ఇదీ చూడండి:భారత్​లో 'ఒమిక్రాన్​' కేసులపై డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక!

Last Updated :Dec 3, 2021, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details