Kerala Loksabha Polls Modi Rahul :దక్షిణాది రాష్ట్రం కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటాపోటీగా పర్యటిస్తున్నారు. కేరళలోని పాలక్కడ్లో జరిగిన ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొనగా, రాహుల్ గాంధీ వయనాడ్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేసుకున్నారు.
'యూపీ సీటు కాపాడుకోవడం కష్టంగా భావించి!'
కాంగ్రెస్కు చెందిన ఓ అగ్రనేత ఉత్తర్ప్రదేశ్లో తన కుటుంబ సీటును కాపాడుకోవడం కష్టంగా భావించి, కేరళలో తన కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి దేశంలో నిషేధించిన ఓ సంస్థతో కాంగ్రెస్ రహస్యం ఒప్పందం చేసుకుందని మోదీ ఆరోపించారు.
ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్ల కోసం సర్వే ప్రారంభమవుతుందని మోదీ హామీ ఇచ్చారు. కేరళలోని పాలక్కడ్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని, తమ మేనిఫెస్టో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతుందన్నారు. గత పదేళ్లలో జరిగింది, మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, దేశానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ను బలహీన దేశంగా మార్చితే, బీజేపీ బలమైన దేశంగా మార్చిందని తెలిపారు. గత పదేళ్లలో భారత విశ్వసనీయతను తమ ప్రభుత్వం ఎలా పెంచిందో అందరూ చూశారని వ్యాఖ్యానించారు మోదీ.